రామన్నపేట, ఫిబ్రవరి 04 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడం ద్వారా ప్రసూతి సేవలను మెరుగుపరచాలని డి సి హెచ్ ఎస్ చిన్న నాయక్ అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, మెరుగైన వసతులు, సౌకర్యాలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బి.వీరన్న, రజిని, స్వాతి బాయి, మాధవచారి, నవీన్ సింగ్, పి.వీణ, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.