భూదాన్ పోచంపల్లి, మే 15 : రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్, జూలూరు పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు, నిర్వాహకులు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించి ఎన్ని రోజులు అయ్యిందని, ఇప్పటి వరకు ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో ఎంత ధాన్యం నిల్వ ఉన్నాయని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా కొనుగోళ్లు కొనసాగించాలని సూచించారు. రోజుకు ఎన్ని లారీల ధాన్యం లోడింగ్ చేసి పంపుతున్నారని, లారీలు సరిపడా ఉన్నాయా అని ఆరా తీశారు.లారీలు తక్కువగా రావడం వల్ల కాంటా ప్రక్రియలో ఏమైనా ఆలస్యం జరుగుతుందా అని ప్రశ్నించారు.
రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్వాహకులను ఆదేశించారు. ఈ రోజు నుంచే ప్రతిరోజూ కనీసం 8 నుంచి 10 లారీలు లోడ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కాంటా వేసి, మిల్లుల వద్ద ధాన్యం వెంటనే అన్లోడ్ అయ్యేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. పోచంపల్లి మండలంలో ఇప్పటివరకు 18 టన్నులు దాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. దాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అదన పు కాంటా, ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలన్నారు.
ఒక మిల్లు అదనంగా ఏర్పాటు చేస్తామని, జూన్ మొదటి వారంలో కొనుగోలు పూర్తి అయ్యేలా చేస్తామని అన్నారు. జిల్లాలో రాజపేట తుర్కపల్లి రామన్నపేట వలిగొండ మండలాల్లో అదన పు గోదాములు ఏర్పాటు చేసి , బీహార్ కూలీలతో దాన్యం దిగుమతి అయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ మేనేజర్ హరికృష్ణ, డిప్యూటీ ఎమ్మార్వో నాగేశ్వరరావు, ఇన్చార్జి ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, ఎం ఆర్ ఐ గుత్తా వెంకట్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జూలూరు గ్రామ సర్పంచ్ కాసుల అంజయ్య గౌడ్, జూలూరు పిఎసిఎస్ సీఈఓ రేబాస్ నరసింహ, రైతులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం వద్దు : కలెక్టర్ అనురాగ్ జయంతి