Jharkhand : జార్ఖండ్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. మరోవైపు జేపీఎస్సీ మాజీ ఛైర్మన్ ఎల్ ఖియాంగ్తేను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. జేపీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఖియాంగ్తేను సోమవారం అరెస్టు చేశారు. బ్లాక్లిస్టులో పెట్టిన టీడీపీఎల్ సంస్థకు ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యత అప్పగించడంపై అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు.
ఖియాంగ్తే గతంలో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఆయనను ప్రభుత్వం జేపీఎస్సీ ఛైర్మన్గా నియమించింది. అయితే, పేపర్ లీకేజీ ఆరోపణలు, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో గత నెల 22న అతడు తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ లీకేజీపై స్పష్టమైన, నిష్పక్షపాత విచారణ జరగాలనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అతడి అరెస్టుకు ముందే సీఐడీ అధికారులు పలుసార్లు ఆయనను ఈ అంశంపై ప్రశ్నించారు. జేపీఎస్సీతోపాటు, జేఎస్ఎస్సీలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. సీఎం ఇంటితోపాటు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.
అక్కడి బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జి చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపారు. ఆందోళనలో పాల్గొన్నారు. జార్ఖండ్ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.