రామన్నపేట, అక్టోబర్ 22 : అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా స్కూల్ కి రాని రికార్డ్ అసిస్టెంట్ కె.చక్రపాణి, ఆఫీస్ సబార్డినేటర్ కోటేశ్వరును సస్పెండ్ చేయాల్సిందిగా డీఈఓను ఆదేశించారు. రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో విద్యార్థులకి కలెక్టర్ గణిత పాఠాలు బోధించారు.
విద్యార్థులందరూ ఇప్పటి నుండే వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. మీరు బాగా చదివి పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే మన జిల్లాకు మంచి పేరు వస్తుందన్నారు. ఈ రోజు పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి ఎందుకు రాలేదు అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎవరు కూడా స్కూల్ రాకుండా ఉండకూడదన్నారు. అనంతరం మునిపంపుల, దుబ్బాక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ లాల్ బహదూర్ ఉన్నారు.