యాదాద్రి, జూలై 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. స్వామి ఆలయ మాఢవీధులు, తిరువీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాం తాల్లో భక్తుల సందడిగా కనిపించింది. స్వామి ఆర్జిత పూజలు, స్వయంభూ దర్శనాల్లో భక్తులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి నిత్యారాధనల్లో భక్తులు పాల్గొన్నారు. సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామిని 30వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. స్వామి కి నిత్యపూజలు తెల్లవారుజామున మూడున్నర గంటలకు మొదలయ్యాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభుమూర్తులను అభిషేకించారు. అనంతరం స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి 7గంటల నుంచి అరగంట పాటు స్వామివారికి తిరువారాధన నిర్వహించిన అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు.
పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. దీక్షాపరుల మండపంలో నిర్వహించిన వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామి ధర్మదర్శనానికి 2.30 గంటలు, రూ.150 దర్శనాలకు గంట సమయం పట్టింది. స్వామి ఖజానాకు రూ.35,09,668 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామిని దర్శించుకున్న సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డి
స్వామివారిని ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆల య అర్చకులు వారికి వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామి ప్రసాదం అందించారు.