మునుగోడు/చండూరు/నాంపల్లి/మర్రిగూడ, జూన్ 29 : కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుంటే సహకరించాల్సిందిపోయి కేంద్రంలోని మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను నిలువరించడమే గాక రుణాలను సైతం అడ్డుకుంటూ అభివృద్ధికి మోకాలడ్డుతున్నదని పేర్కొన్నారు. అటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమిస్తూనే, ఆర్థ్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణ శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన 376 మంది లబ్ధ్దిదారులకు రూ.3.76 కోట్ల విలువజేసే కల్యాణలక్షి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా పల్లెపల్లెనా తిరుగుతూ, గడపకూ వెళ్లి చెక్కులు ఇవ్వడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఉన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని కొంపల్లి, మునుగోడు, గూడపూర్, చండూరు మండల కేంద్రంతోపాటు బంగారిగడ్డ, గట్టుప్పల, నాంపల్లి మండల కేంద్రం, మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి బుధవారం పంపిణీ చేశారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.90 లక్షలతో చేపట్టనున్న పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి గుజరాత్ రాష్ట్రం నమూనా అంటే నవ్వొస్తుందని, దేశాన్ని చీకట్లోకి నెట్టడమే ప్రధాని మోదీ ఉద్దేశమని ఆరోపించారు. గుజరాత్లో వ్యవసాయానికి కేవలం 6 గంటల విద్యుత్ మాత్రమే అందిస్తున్నారని, పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు సెలవులు ప్రకటించి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను నిలువరిస్తూ బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి మోకాలడ్డుతుందని మండిపడ్డారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా అధిగమించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
కరోనా మహమ్మారితో ఏర్పడిన తీవ్ర సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని, ఇది సీఎం కేసీఆర్ దక్షతకు నిదర్శనమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్ర సర్కారు రాష్ర్టానికి ఎన్ని ఆటంకాలు కలిగించినా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయని తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని గుర్తుచేశారు.
అంతకుముందు మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీతో, ఖుదాభక్ష్పల్లిలో పూలవర్షం కురిపిస్తూ మంత్రి జగదీశ్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో నల్లగొండ, దేవరకొండ ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, గోపీరాంనాయక్, ఎంపీపీలు కర్నాటి స్వామి, ఏడుదొడ్ల శ్వేత, మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీలు నారబోయిన స్వరూపారాణి, కర్నాటి వెంకటేశం, ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, పాశం సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీలు అనంతవీణ, పానగంటి రజిని, చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, కమిషనర్ వెంకట్రాం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుర్రం మాధవీవెంకట్రెడ్డి, మర్రిగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, తాసీల్దార్లు జక్కర్తి శ్రీనివాస్, మహేందర్రెడ్డి, పుష్పలత, లాల్బహుదూర్, ఎంపీడీఓలు యాకూబ్నాయక్, జానయ్య, శేషుకుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, గుమ్మడపు నర్సింహారావు, తోటకూరి శంకర్యాదవ్, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, చండూరు పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, మునుగోడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య, రైతు బంధు సమితి నాంపల్లి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, మునుగోడు కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ పాల్గొన్నారు.