భువనగిరి కలెక్టరేట్, జూన్ 29 : మాతృత్వం.. మాటలకు అందని ధీరత్వం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు స్త్రీ పెద్ద పోరాటమే చేస్తుంది. బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరోజన్మ ఎత్తుతుంది. ఈ క్రమంలో తల్లి కడుపుపై కత్తి పెట్టకుండా సాధారణ ప్రసవాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. కాసుల కక్కుర్తితో ప్రైవేట్ దవాఖానలు అడ్డగోలుగా సిజేరియన్లు చేస్తున్న క్రమంలో ఆపరేషన్ వల్ల భవిష్యత్లో ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పిస్తున్నది. ఆ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులను మరింత పెంచేందుకు ముందు నుంచీ గర్భిణులను సంసిద్ధం చేస్తున్నది. సాధారణ ప్రసవానికి దోహదపడే యోగాసనాలపై పీహెచ్సీ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారి ద్వారా జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు నేర్పించింది. వారంతా క్షేత్రస్థాయిలో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు.
అత్యాధునిక ప్రభుత్వం వైద్యం ప్రజలకు చేరువైంది. జిల్లా దవాఖానల నుంచి పీహెచ్సీల వరకు ఉచితంగా చికిత్స చేసి మందులు అందిస్తున్నారు. కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని దవాఖానల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది. దాంతో సర్కారు దవాఖానలకు నమ్మకం ఏర్పడింది. ఔట్ పేషెంట్స్, ఇన్పేషెంట్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో నేను రాను సర్కారు దవాఖానకు అన్న వారే నేడు వైద్యం చేయించుకుంటున్నారు. ప్రసవాలు కూడా భారీగా పెరిగాయి. గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడం, కేసీఆర్ కిట్తోపాటు వివిధ సౌకర్యాలు కల్పించడంతో సర్కారు దవాఖానలకు మహిళలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సిజేరియన్తో కలిగే అనర్థాలను నివారించి సాధారణ ప్రసవాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. పలు యోగాసనాలను నేర్పిస్తున్నారు.
గర్భందాల్చినప్పటి నుంచి..
సాధారణ ప్రసవాలపై మహిళల్లో అవగాహన కల్పించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితోపాటు ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. గర్భిణులను గుర్తించి నార్మల్ డెలివరీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు ఏ యోగాసనాలు వేయాలో వివరిస్తున్నారు.
ఆసనాలపై వైద్య సిబ్బందికి శిక్షణ
గర్భిణులతో చేయించే యోగాసనాలపై ముందుగా జిల్లాలోని 10 పీహెచ్సీ సూపర్వైజర్లకు ఈ నెల 16న జనగాం జిల్లాలో ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. వారు ఆ ఆసనాలపై జిల్లాలోని 21 పీహెచ్సీల్లో ఈ నెల 17, 18 తేదీల్లో క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి వివరించారు. సాధారణ ప్రసవాల పెంపు లక్ష్యంగా గర్భిణులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
ఆసనాలపై అవగాహన
సాధారణ ప్రసవాలు జరుగడానికి ఆరోగ్య సిబ్బంది గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. పది రకాల ఆసనాలను నేర్పిస్తున్నారు. సాధారణ నడక, నడుము తిప్పడంతోపాటు సీతాకోక చిలుక ఆకృతిలో కూర్చోవడం, పిల్లి, ఒంటె, వంతెన ఆకారంలో ఆసనాలు వేయడం, నిదానంగా కూర్చొని లేవడం, సైడ్ స్ట్రెచ్, గోడ కుర్చీ తదితర ఆసనాలపై వివరిస్తున్నారు.
సాధారణ ప్రసవాలే లక్ష్యంగా..
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆసనాలపై ఇప్పటికే ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వగా వారు క్షేత్రస్థాయిలో తెలిసేలా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పటికే సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగాయి. ఆసనాలతో మరింత పెరిగే అవకాశం ఉంది.
–దారా సత్యవతి, ఆరోగ్య సూపర్వైజర్,ఆశ శిక్షకురాలు