యాదాద్రి, సెప్టెంబర్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్యక్షేత్రంతో పాటు అనుబంధ పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సంప్రదాయరీతిలో విశేష పూజలు చేశారు. వేకువజామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు చేశారు. ముందుగా 108 వెండి కళశాలకు పూజలు చేశారు. పంచసూక్త పఠనంతో హోమం చేసి ఉత్సవమూర్తులు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చనలు చేశారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిత్య పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలబోగం, స్వామివారికి నిజాభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. ప్రధానాలయ లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ.28,62,213 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. స్వామివారి విమాన గోపురం స్వర్ణ తాపడానికి భువనగిరికి చెందిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ రూ.25వేల విరాళం చెక్కును మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి అందించారు.
శ్రీవారి సేవలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
యాదాద్రీశుడిని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో మంత్రికి అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదం అందించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ యాదాద్రిలో సకల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కొండకింద నిర్మాణాలు తుదిదశకు చేరాయన్నారు. యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగిందన్నారు. యాదాద్రి ప్రాంతమంతా గొప్ప టూరిజం హబ్గా మారబోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా స్వామివారిని రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.