భూదాన్ పోచంపల్లి, మే 19 : రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి, జూలూరు గ్రామాల్లోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిలాయిపల్లి ఇంద్రకీలాద్రి రైస్ మిల్లును ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తరలింపు పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించి ధాన్యం నిల్వ ప్రక్రియ చేపట్టాలని ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలు లారీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని ధాన్యం తరలింపు ప్రక్రియలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే దాన్యం సమస్యలు ఎదురవుతున్నాయని బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. తాలు శాతం అధిక ఉన్న ప్రాంతాల్లో రైతులు మి ల్లర్లు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, సివిల్ సప్లయ్ డిఎం హరికృష్ణ, డీఎస్ఓ రోజా రమణి, డిప్యూటీ తాసిల్దార్ నాగేశ్వరరావు, ఎమ్మారై గుత్తా వెంకటరెడ్డి, జూలూరు పిఎసిఎస్ చైర్మన్ అందెల లింగం యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, మార్కెట్ డైరెక్టర్ సుర్వి వెంకటేష్ , మద్ది అంజిరెడ్డి, లాలయ్య, జిల్లా నాయకులు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదన్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, సామ మోహన్ రెడ్డి, కాసుల అంజయ్య, గోరంటి శ్రీనివాస్ రెడ్డి, ఫకీరు మల్లారెడ్డి పాల్గొన్నారు.