యాదాద్రి భువనగిరి, నవంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నం పెట్టే రైతన్నకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై నినదించేందుకు టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో శుక్రవారం చేపట్టిన మహాధర్నా సూపర్ సక్సెస్ అయ్యింది. టీఆర్ఎస్ శ్రేణులు, అనుబంధ సంఘాల నేతలతోపాటు రాజకీయాలకు అతీతంగా రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి కదం తొక్కింది. తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొంటరా? కొనరా? అంటూ పిడికిలెత్తి ముక్త కంఠంతో నినదించాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ సేన దండులా కదలి వేలాది మందితో రైతులతో కలిసి ఉదయమే ధర్నా ప్రాంతానికి చేరుకున్నాయి. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, భువనగిరి కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డితోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నేతలు పాల్గొని కేంద్రం వైఖరిని ఎండగట్టారు.
ధాన్యం కొనుగోలు చేయాలి
రైతు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఏండ్ల సంది వరి పండిస్తున్నాం. యాసంగి వడ్లు కొనేదిలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు. గతంలో వర్షాల్లేక పంటలు సరిగ్గా పండేవి కావు. ఇప్పుడు కాలం కలిసొచ్చింది. సాగు చేసేందుకు ప్రభుత్వం రెండు విడుతల్లో పెట్టుబడి సాయం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రైతులను అయోమయానికి గురి చేయొద్దు.