కనులపండువగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం
ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు
సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
గోవింద నామస్మరణతోమార్మోగిన బాలాలయ ప్రాంగణం
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి దంపతుల హాజరు
యాదాద్రి భువనగిరి, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసి.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడి అలంకరణలో గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా రాగా.. భక్తకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారు పుష్పాల పల్లకిలో కల్యాణ వేదికకు చేరుకున్నారు. అభిజిత్ లగ్న సుముహూర్తంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సంప్రదాయబద్ధంగా కల్యాణోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని భక్త జనులు కనులారా వీక్షించి తరించారు. బాలాలయంలో ఇదే చివరి కల్యాణోత్సవం కాగా, అర్చక బృందం, పారాయణీకుల వేదఘోష, భక్తుల గోవింద నామస్మరణతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి నరసింగరావు, కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి పాల్గొన్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన కల్యాణోత్సవం శుక్రవారం పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఊరేగింపుగా వచ్చిన వధూవరులు.. పుష్పాలంకరణ, విద్యుద్దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతున్న కల్యాణ వేదికపై ఆసీనులు కాగా అభిజిత్ లగ్న సుముహూర్తాన శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవదేవుడితో జరిగిన మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని భక్త జనులు కనులారా వీక్షించి తరించారు. బాలాలయంలో ఇదే చివరి కల్యాణోత్సవం కాగా.. అర్చక బృందం, పారాయణీకుల వేదఘోష నడుమ వేడుక సంబురంగా సాగింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
శ్రీరాముడు సుందర, సురుచిర శుభాంగుడు. ధర్మజ్ఞుడు, సత్య సంధుడు, ప్రజా హితుడు, స్థిర చిత్తుడు. చంద్రుడి వలె ప్రియ దర్శనుడు. సముద్రుడి వలె గంభీరుడు, హిమవంతుని వలె ధైర్యవంతుడు, విష్ణుమూర్తి వలె వీర్యవంతుడు. క్రోధంలో కాలాగ్ని సముడు. సహనంలో పృథ్వీ సముడు. పితృవాక్య పరిపాలన గావించి ధర్మమూర్తియై ధరణిలో నడయాడిన దివ్య కల్యాణ గుణ పురుషోత్తముడు. శ్రీరాముని సర్వోత్తమ దాస భక్తుడు హనుమంతుడు. శ్రీరామనామ స్మరణం, గుణ కీర్తనం తప్ప మరేదీ తెలియని భక్తాగ్రేసరుడు. మహావీరుడు. మహాధీశాలి. విద్వాంసుడు. స్వామి భక్తుడు. భగవంతుని తత్తరహస్య గుణ ప్రభావాలను బాగా తెలిసిన వాడు. శ్రీరాముడిని తన భుజ స్కంధములపై మోసిన భాగ్యశాలి. శ్రీస్వామి వారు ధర్మమూర్తియైన శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనముపై భక్తులకు దర్శన భాగ్యం కలిగించి ‘ధర్మో రక్షతి రక్షితః’ అను సందేశమును తెలియజేయుచున్నాడని శ్రీరామ అలంకారము, హనుమంత సేవ విశిష్టతను వేద పండితులు వివరించారు. హనుమద్వాహనారూఢుడైన శ్రీ స్వామి వారిని దర్శించిన సకల శుభములు కలుగునని పురాణోక్తి.
పెళ్లి కూతురు అలంకరణలో లక్ష్మీ అమ్మవారు సృష్టికర్త బ్రహ్మ సారథ్యం.. మహా విష్ణువు, మహేశ్వరులే గాకుండా సకల దేవతల సమక్షంలో.. విష్వక్సేనుడి పర్యవేక్షణ.. పాంచరాత్రాగమ విధానాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం బాలాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు కల్యాణం ప్రారంభం కాగా.. విశ్వశాంతికి దోహదపడే కల్యాణ ఘట్టాలన్నీ ఆటంకాల్లేకుండా విష్వక్సేనారాధనతో చేపట్టారు. అగ్ని పూజ, స్వస్తీ వాచనం, యజ్ఞోపవీతం, పాద ప్రక్షాళన, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల పర్వంతో కల్యాణం నేత్రపరంగా ముగిసింది. రెండు గంటలపాటు శాస్ర్తోక్తంగా జరిగిన తతంగం ఆధ్యాత్మిక శోభను సంతరింపజేసింది. ప్రధాన పూజారులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధాన పూజారులు వెంకటాచార్య, మూర్తి, రంగా చార్యులు కల్యాణ పర్వాలను నిర్వహించారు. సంస్కృత విద్యాపీఠం విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రామాచార్యులు కల్యాణ విశిష్టతను వివరించారు. హైదరాబాద్కు చెందిన జయప్రదా రామ్మూర్తి గాత్ర కచేరీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ అలరించింది.
సాయంకాల పూజలు…
తిరు కల్యాణ మహోత్సవం అనంతరం బాలాలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీస్వామి వారికి నిత్య ఆరాధనలు, చతుస్థానార్చనలు, మంటపారాధనలు, మూలమంత్ర జపములు, ద్వారా తోరణ పూజలు, దివ్య ప్రబంధ పారాయణాదులు, మహామంత్ర పుష్ప పఠనాదులు, పురాణ, ఇతిహాస విజ్ఞాపనలు, లక్ష్మీ సూక్తి పారాయణములు, శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణములు నిర్వహించారు.
తిరు కల్యాణ వైభవం, గజవాహన సేవ ప్రత్యేకత..
శ్రీలక్ష్మీనృసింహ కల్యాణము జగత్ కల్యాణ కారకము. భక్త రక్షణకై నృసింహస్వామిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు నృసింహ అవతారములో గజ వాహనారూఢుడై తిరు కల్యాణ మహోత్సవమునకు విచ్చేయుట భక్త రక్షణ తత్పరతను సూచించుచున్నదని అంతరార్థం. గజ రక్షణలో భగవానుడు అలనాడు చూపించిన ఆతృత నేటికీ దర్శింప చేయుట గజరాజుపై విచ్చేయుటకు సంకేతము. గజము అనగా జీవుడు అని, జీవుడి హృదయాంతరములలో నివసించు భగవానుడే నృసింహుడని పురాణ వాక్యము. హృదయాంతరవర్తియగు పరమాత్మను స్మరించిన సర్వవిధ శుభములు, కల్యాణ వేడుకలను దర్శించిన పుణ్యలోక ప్రాప్తి కలుగునని కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారని వేద పండితులు వివరించారు.
బాలాలయంలో చివరిసారిగా..
యాదాద్రి క్షేత్రంలోని బాలాలయంలో శుక్రవారం జరిగిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేడుకలు చివరివి. వచ్చే ఏడాది నుంచి కల్యాణ తంతు ప్రధానాలయంలో జరుగనున్నది. ఆలయ పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ సలహాలు, సూచనల మేరకు బాలాలయాన్ని ప్రధానాలయం ఉత్తర దిశలో ఏర్పాటు చేసి దర్శనాలకు అవకాశం కల్పించారు. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా 2016 ఏప్రిల్ 21న బాలాలయాన్ని ప్రారంభించగా.. భక్తులకు కవచ మూర్తుల దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రధానాలయంలో చివరిసారిగా స్వామివారి బ్రహ్మోత్సవాలు 2016 మార్చిలో జరుగగా.. 2017 మార్చి 6న మొదటి సారిగా శ్రీస్వామి వారి వైభవోత్సవ కల్యాణాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరు కల్యాణాన్ని ఉదయం కొండపైన, వైభవోత్సవ కల్యాణాన్ని పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తూ వస్తున్నారు. మార్చి 28న నిర్వహించే మహా కుంభ సంప్రోక్షణ సందర్భంగా ఈసారి పట్టణంలో నిర్వహించే వైభవోత్సవ కల్యాణాన్ని రద్దు చేయగా.. కొండపైన కేవలం తిరు కల్యాణాన్ని అట్టహాసంగా నిర్వహించారు.
నేటి రథోత్సవానికి సన్నాహాలు..
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే రథోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. గతంలో ఆస్థానపరంగా కొండపై బాలాలయంలో రాత్రి 7 గంటలకు నిర్వహించి.. ఆ తర్వాత 8 గంటలకు పట్టణ వీధుల్లో ప్రచార రథ యాత్రలను నిర్వహించేవారు. కానీ, ఈ సారి పట్టణంలో రథ యాత్రను రద్దు చేశారు. అయితే ఈ సారి స్వామి, అమ్మవార్లను బంగారు రథంలో ఊరేగించనున్నారు. దాతల సాయంతో చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ నిపుణులు ఈ రథానికి రూపకల్పన చేసింది. తళుకులీనుతున్న స్వర్థ రథంపై స్వామి అమ్మవార్లు రాత్రి 7 గంటలకు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పట్టు వస్ర్తాల సమర్పణ…
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సతీసమేతంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీ స్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్ర్తాలను సమర్పించారు. వీటిని బాలాలయంలో ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులకు అందజేశారు.
కల్యాణోత్సవంలో ప్రధాన ఘట్టాలు…
ఉదయం 10.30 గంటలకు స్వామి వారికి శ్రీ రామ అలంకార సేవ
-10.45 గంటలకు గజవాహనంపై ఊరేగింపుగా మండపానికి లక్ష్మీనృసింహుడు
-11.05 గంటలకు స్వామి వారి సేవకు హారతి
-11.07 గంటలకు స్వస్తీవాచనంతో కల్యాణోత్సవం ప్రారంభం
-11.51 గంటలకు రక్షా బంధనం
-మధ్యాహ్నం 12.50 గంటలకు జీలకర్ర బెల్లం సమర్పణ
-12.57 గంటలకు మాంగల్యధారణ
-1.10 గంటలకు ముగిసిన కల్యాణోత్సవం