యాదాద్రి, అక్టోబర్ 7 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం శుక్రవారం భక్తజన సంద్రంగా మారింది. భక్తుల రాకతో యాదాద్రి మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రధానాలయం ఎటుచూసినా భక్తులే కనిపించారు. దసరాకు స్వగ్రామాలకు వెళ్లి ప్రజలు తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శానికి 2గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. పరమపవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగింది. కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 13,978మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.29,61,251 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
యాదాద్రీశుడిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీదేవి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం యాదాద్రికి చేరుకున్న ఆమె స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. అదేవిధంగా స్వామిని తెలుగు సినిమా రచయిత, దర్శకుడు అల్లాణి శ్రీధర్ సతీసమేతంగా దర్శించుకున్నారు.
నాయీ బ్రాహ్మణుల వేతనం పెంపు
యాదాద్రి కొండకింద కల్యాణకట్టలో కేశ ఖండనలో పాల్గొనే నాయీ బ్రాహ్మణులకు వేతనం 60శాతానికి పెంచుతున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు కేశ ఖండన టికెట్టు ధర రూ.50 పెంచిన్నట్లు వెల్లడించారు. గతంలో కేశ ఖండన టికెట్ రూ.20 ఉండగా ఇందులో 50శాతం దేవాలయానికి, 50శాతం నాయీ బ్రాహ్మణులను అందించారు. తాజాగా పెంచిన రూ.50 టికెట్లో రూ.30 నాయీ బ్రాహ్మణులకు, మిగతా రూ.20 దేవస్థానానికి అందిస్తున్నట్లు పత్రిక ప్రకటనలో తెలిపారు. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయన్నారు.