బీబీనగర్, జూన్ 02 : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో గాదె నరేందర్రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా, మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన తెలంగాణ సాధన కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు, కేసులను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడిగా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాదె నరేందర్రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్తో పాటు ఉద్యమ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.