యాదాద్రిభువనగిరి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపడితే బండి యాదాద్రి నృసింహుడి సన్నిధిలో గుండు కొట్టించుకుంటాడా అని ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సవాల్ విసిరారు.
బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుట్టలో బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర అట్టర్ ప్లాప్ అయిందన్నారు. భువనగిరి, సూర్యాపేట, జనగామ, బోధన్ ప్రాంతాల నుంచి జనాన్ని తరలించినా.. కేవలం రెండున్నర ఎకరాల్లోని సభా ప్రాంగణం నిండలేదని ఎద్దేవా చేశారు.
ఈ సభతో స్థానికంగా బీజేపీకి ఆదరణ లేదనే విషయం స్పష్టం అయిందన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మానాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా ? అని ప్రశ్నించారు. బండి సంజయ్ తన కరీంనగర్ లోని వేములవాడ ఆలయానికి ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి మంజూరు చేయించారా ? అంటూ నిలదీశారు.
సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో నూతన గ్రామ పునర్నిర్మాణ లేఅవుట్ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 99 శాతం దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశామని వివరించారు.