బీబీనగర్, ఫిబ్రవరి 23 : బీబీనగర్ గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమీపంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద గ్రామానికి చెందిన వాహనాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులతో కలిసి టోల్ ప్లాజా డైరెక్టర్ చంద్రమోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బీబీనగర్ పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్న గూడూరు టోల్ ప్లాజా వద్ద స్థానికులకు ఫ్రీ పాస్లు లేకపోవడంతో ప్రతిసారి టోల్ చార్జీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. గ్రామానికి చెందిన వాహనాలకు ఉచిత పాస్లు ఇవ్వాలని, హైవేపై బీబీనగర్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బీబీనగర్ పట్టణ కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు దాటే సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని, అక్కడ అండర్పాస్ వంతెన నిర్మించాలని అన్నారు.
ఎయిమ్స్ నుంచి తాసీల్దార్ కార్యాలయం వరకు సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు లేక బస్టాప్ నుంచి ఊరిలోకి వచ్చే విద్యార్థులు ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారని వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాసీల్దార్ కార్యాలయం వద్ద హైవే నుంచి సర్వీస్ రోడ్డుకు అనుసంధానం కల్పించాలని, రహదారిని వారానికి రెండుసార్లు శుభ్రం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి నర్సింహా రెడ్డి, వార్డు సభ్యులు మంగ అశోక్, ఆకుల రాజాలక్ష్మి రవీందర్, పంజాల ప్రవీణ్ గౌడ్, నెల్లుట్ల శ్రీశైలం, కట్ట వినోద్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పలంచి శ్రీకాంత్, దేవరుప్పుల శ్రీధర్ పాల్గొన్నారు.