యాదాద్రి భువనగిరి,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆలేరు టౌన్, నవంబర్ 12 : కేంద్రంలోని మోదీ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కర్షక లోకం కదం తొక్కింది. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, నినాదాలు హోరెత్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నుంచి ధర్నాకు ముందే అనుమతి తీసుకుని శాంతియుతంగా ధర్నాను నిర్వహించారు. అన్ని మండలాల నుంచి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భువనగిరిలో జరిగిన మహాధర్నాలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జడల అమరేందర్ గౌడ్, భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్పోచంపల్లి మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, పట్టణ, గ్రామ, వార్డు కమిటీల అధ్యక్షులు, అనుబంధాల సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆలేరులో జరిగిన ధర్నాకు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ధర్నా వేదికపై కళాకారులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఆల్టా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, వివిధ మండలాల పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ మండలా ధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు శంకరయ్య, శ్రీనివాస్, మల్లేశం, రాములు, నాగరాజు, బాలస్వామి, వెంకట్రెడ్డి, అనూరాధ, సుధామహేందర్, మహేశ్వరి, బాలమణి, రాజిరెడ్డి, వెంకటయ్య, ఉప్పలయ్య, చింతకింది చంద్రకళ, భాస్కర్రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
రైతులపై కేంద్రం కక్ష కట్టింది
రైతుల పట్ల కక్షపూరితంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. ధాన్యం సేకరణపై చేతులెత్తేసి తెలంగాణలో పండించిన బాయిల్డ్ రైస్ను కొనబోమని కేంద్రం తేల్చిచెప్పింది. రాష్ట్ర బీజేపీ నేతలు ఈ నిజాలను కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతూ రైతుల జీవితాలతో బీజేపీ ఆడుకొంటున్నది. రైతులంటే సీఎం కేసీఆర్కు ఎంత ప్రేమో అందరికీ తెలుసు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులను కల్గించే కుట్రలకు తెరతీసింది. వానకాలం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజనూ కొంటుంది. ధాన్యం సేకరణపై కేంద్రం చేతులెత్తేయడం వల్లే యాసంగిలో వరి సాగు వద్దంటున్నాం. వాస్తవాలను గ్రహించి రైతులు అర్థం చేసుకోవాలి.
-పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
రైతులతో పెట్టుకుంటే కుప్పకూలిపోవడం ఖాయం
రైతులేని రాజ్యం లేదు. సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు బంధువయ్యారు. రైతుల కోసం దేశంలో మరే సీఎం కేసీఆర్లాగా పనిచేయడం లేదు. కేంద్రం మాత్రం రైతులతో దోబూచులాడుతున్నది. ధాన్యం కొనే విషయంలో రైతులను సందిగ్ధంలో ఉంచింది. దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిందే. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా కుప్పకూలిపోవడం ఖాయం. ఇది చరిత్ర చెబుతున్న అక్షర సత్యం. కేంద్రానికి కూడా ఇదే గతి పడుతుంది. ధాన్యం కొనలేమని చెబుతున్న కేంద్రం క్రాప్ హాలిడేగా ప్రకటించి ఆర్థిక సాయం అందించే విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్రం బాధ్యత మరిచి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం దారుణం.
-ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ
రైతులతో రాజకీయం చేయొద్దు
రైతులతో బీజేపీ నాయకులు రాజకీయం చేయొద్దు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దులో ఇప్పటికే ధర్నాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ మంత్రులు రైతులను కార్లతో తొక్కి చంపుతున్నారు. యాసంగిలో గింజ కూడా కొనమని కేంద్రం చెబుతుంటే..రాష్ట్రంలో బీజేపీ నేతలు మొత్తం పంట కొంటామంటూ అసత్యప్రచారం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందేందుకు ప్రతిపక్ష పార్టీలు ఆరాటపడుతున్నాయి. జిల్లా ఆవిర్భావం నుంచి నేటి వరకు వరి సాగు, దిగుబడులు గణనీయంగా పెరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే మంచిది. ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేద్దాం.
ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా పంటలు బాగా పండుతున్నా యి. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్రంపై అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ వివక్ష చూపుతున్నది. గత యాసంగిలో తెలంగాణలో 93లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడాలి. ధాన్యం కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సమైక్య పాలనలోని తెలంగాణకు, ఏడేండ్ల తెలంగాణకు ఏముందో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విశ్లేషించుకోవాలి.
-డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి
ధర్నా సక్సెస్తో శ్రేణుల్లో కొత్త జోష్
కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేసేలా సీఎం కేసీఆర్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహ రచన చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రైతాంగానికి వెన్నుదన్నుగా టీఆర్ఎస్ పార్టీ ఉంటున్నదని చెప్పేందుకు చేపట్టిన ధర్నాను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు సైతం తీవ్రంగా శ్రమించాయి. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు కిందిస్థాయి క్యాడర్ను సమాయత్తం చేశాయి. వేల మంది రైతులు ధర్నాలో భాగస్వామ్యులను చేయడంలో పార్టీ శ్రేణులు సఫలీకృతులయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి గులాబీ దండు తెల్లవారుజాము నుంచే నియోజకవర్గ కేంద్రాల వైపుగా కదిలింది. నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ర్యాలీగా బయలుదేరి వాహనాల్లో ధర్నా ప్రాంతాలకు చేరుకున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో నాలుగు గంటల పాటు ధర్నాలు కొనసాగాయి. ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ధర్నాకు వివిధ వర్గాల వారు హాజరవ్వడంతో రెండు చోట్లా నిర్వహించిన ధర్నా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ధర్నాలతో రైతాంగంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా చెప్పగలిగామని నేతలు పేర్కొంటున్నారు. ధర్నా కార్యక్రమాలు పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపింది.
రైతు బంధు ఇచ్చేది ఒక్క తెలంగాణలోనే
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం తెలంగాణలోనే అమలవుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ ఓటు బ్యాంకును అమ్ముకోవడం వల్లే హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది. ఒకటి, రెండు సీట్లు గెలిచినంత మాత్రాన బీజేపీ అధికారంలోకి వస్తుందని కలలు కనడం విడ్డూరం. తెలంగాణ రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తుంది. ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలతో దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలం చెందింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. దళితబందు పథకం గొప్ప పథకం.
కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నది. పంజాబ్ రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ..తెలంగాణ రైతుల వద్ద నుంచి ధాన్యం ఎందుకు కొనదు. రైతుల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు రాజ్యం అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కొర్రీలు పెడుతున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులను నిండా ముంచుతున్నవి. బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నరు.
-మందుల సామేలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్