– ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
బీబీనగర్, ఏప్రిల్ 04 : ఎయిమ్స్ బీబీనగర్ పేరిట ఎయిమ్స్ బీబీనగర్ జాబ్ ఆపర్చునిటీస్–2026” పేరుతో వివిధ వేదికలలో ప్రచారం జరుగుతున్న ఉద్యోగ ప్రకటనలు పూర్తిగా నకిలీవని ఎయిమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపిక చేస్తామని పేర్కొంటూ ప్రచారం చేస్తున్న ఈ ప్రకటనలతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తరఫున ఇలాంటి నియామక ప్రకటనలు ఎప్పుడూ విడుదల చేయలేదని, నియామకాలు ఎల్లప్పుడూ సరైన ఎంపిక విధానం ద్వారా మాత్రమే నిర్వహించబడతాయని వెల్లడించారు. సంస్థకు సంబంధించిన అన్ని అధికారిక ఉద్యోగ ప్రకటనలు కేవలం అధికారిక వెబ్సైట్, పత్రికల ద్వారానే విడుదల అవుతాయని పేర్కొన్నారు. నకిలీ ప్రకటనలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. వ్యక్తిగత వివరాలు పంచుకోవడం లేదా ఎలాంటి చెల్లింపులు చేయడం నివారించాలని హెచ్చరించారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా అధికారిక వనరుల ద్వారానే నిర్ధారించుకోవాలని కోరారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.