యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం స్వామి, అమ్మవార్ల నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవంతో పాటు స్వామివారి నిత్యపూజల్లో భక్తుల పాల్గొని తరించారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసిండిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమం ద్వారా ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసిండిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు.
కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణమూర్తులను గజవాహనంలో బాలాలయంలో ఊరేగించారు. ఆలయంలో దర్శనం తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామి సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు శనివారం రూ. 8,32,456 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.