మోత్కూరు, సెప్టెంబర్ 07 : రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన ఎమర్జెన్సీ పాలనలా కొనసాగుతుందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మోత్కూర్లో నిర్వహించిన నిరసన ర్యాలీకి ఆయన హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ పేరుతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగుతున్న పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకపోవడంపై తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులను అడ్డుపెట్టుకుని దాష్టీకం చేసిందని మండిపడ్డారు. గతంలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ వైఖరిపై తమ పార్టీ నిరంతర పోరాటాలకు సిద్ధం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్