భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 07 : భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిని ఆయన సందర్శించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. చేనేత సహకార సంఘంలో ఇక్కత్ వస్త్రాలను పరిశీలించారు. స్థానిక పెండెం వైకుంఠం, కడవేరు శేఖర్ కార్మికుల ఇంటిని సందర్శించి చేనేత మగ్గం, వస్త్రాల తయారీ ప్రక్రియ, రంగుల అద్దకం, నూలు పడకడం ప్రక్రియలను ఆయన పరిశీలించారు. చేనేత సహకార సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపినప్పుడే లక్ష్మణ్ బాపూజీకి ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. చేనేత వస్త్రాలకు దేశ విదేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం తీసుకుని మార్కెటింగ్ వ్యవస్థను కల్పిస్తే పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో చేనేత దుస్తులు వినియోగించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగమని, చేనేత పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. చేనేత సహకార సంఘాలు పటిష్టం చేయాలని, చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని, కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వన్నాల శ్రీరాములు, కర్నాటి ధనంజయ, పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, గౌరవాధ్యక్షుడు కర్నాటి బాలరాజు, అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, జిల్లా కార్యదర్శి ఎన్నం శివకుమార్, మాజీ సర్పంచ్ నోముల గణేశ్, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు భారత వాసుదేవ్, జిల్లా నాయకుడు గంజి బసవలింగం, సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు, నాయకులు భారత బాలరత్నం, గంజి కృష్ణ, గంజి బాలరాజు, మంగళపల్లి రమేశ్, దశరథ పాల్గొన్నారు.
Bhoodan Pochampally : చేనేత క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి : బండారు దత్తాత్రేయ