శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చిన లక్ష్మీనారసింహుడు
శాస్ర్తోక్తంగా దివ్యవిమాన రథోత్సవం
వైభవంగా స్వామివారికి గరుఢ సేవ
నేడు చక్రతీర్థ స్నానం, దేవతోద్వాసన
యాదాద్రి, మార్చి 12;యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో కల్యాణ తంతు పూర్తిచేసుకున్న లక్ష్మీనరసింహుడు శనివారం ఉదయం శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చారు. తనకు ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై శ్రీమహాలక్ష్మి అమ్మవారితో కలిసి ఊరేగారు. అర్చక బృందం, వేద పండితులు, వేదపారాయణీకులు వేదోక్త పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ అలంకార సేవ నేత్రపర్వంగా సాగింది. సాయంత్రం భక్తుల జయజయధ్వానాల నడుమ స్వర్ణరథంపై స్వామి,అమ్మవార్లను అధిష్ఠించి దివ్య విమాన రథ్సోతవం నిర్వహించారు. ఆదివారం ఉదయం చక్రతీర్థ స్నానం చేయించనున్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం అనంతరం జరిపే తంతును అర్చక బృందం పాంచరాత్రాగమశాస్త్రరీతిలో జరిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి అలంకార సేవ ముగింపు కార్యక్రమంలో స్వామివారిని శ్రీమహావిష్ణువుగా అలంకరించారు. నిత్యారాధనల అనంతరం ఉదయం స్వామివారిని శ్రీమహావిష్ణు అలంకారంలో గరుఢ వాహన సేవలో ఊరేగించారు. ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణీకులు, అత్యంత వైభవంగా అలంకార సేవను నిర్వహించారు.
అలంకారాలకు మూలం శ్రీమహావిష్ణువే
‘విష్ణు’ శబ్దమునకు సర్వవ్యాపకుడని అర్థం. పాల కడలిలో శ్రీలక్ష్మీ విశిష్ణుడై శ్రీమహావిష్ణువు చతుర్భుజములతో శంఖ, చక్రాది ఆయధాలతో సనక, సనందనాది యోగులను కటాక్షించుట, ముక్త పురుషులు స్వామిని స్తుతించుట, లోకములను పరమాత్మ అనుగ్రహించుట విశేషమైయున్నదని ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. అలంకారాలన్నింటికీ మూలమైన మహావిష్ణు రూపంలో శ్రీలక్ష్మీనృసింహస్వామిని అలంకరించి గరుఢ వాహనారూఢున్ని గావించారని వివరించారు. ‘వేదైశ్చ సర్వైరహమేవ వేద్య’ అనే గీతా వచనానికి నిలువెత్తు నిదర్శనం గరుఢ వాహనం. సమస్త మంత్రములకు నిలయమైన పరమాత్మను ముందుండి మన దగ్గరకు తీసుకువచ్చునది వేదమే. వేద విహితములైన మంత్రరాశులే పరమాత్మను దర్శింపజేస్తాయని పేర్కొన్నారు. గరుఢ వాహనారూఢుడైన స్వామిని దర్శించిన కాల సర్ప, గ్రహ, గృహ, దోషాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయిని వేదాలు పేర్కొనుచున్నాయని ప్రధానార్చకులు వెల్లడించారు.
వైభవంగా రథోత్సవం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో సాయంత్రం దివ్య స్వర్ణ విమాన రథోత్సవం ఆగమ నియమాలకు అనుగుణంగా బాలాలయ ఉత్సవ మండపంలో నిర్వహించారు. నిత్యారాధనలు, చతుస్థానార్చనలు, మంటపారాధనలు, మూలమంత్రజపాలు, ద్వారాతోరణ పూజలు, దివ్యప్రబంధ పారాయణాదులు, మహామంత్ర పుష్ప పఠనాలు, పురాణ, ఇతిహాస విజ్ఞాపనలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి ఆకుల తోరణాలతో స్వామివారి బంగారు రథాన్ని అలంకరించారు. అర్చకస్వాములు విష్వక్సేన పూజలతో రథాంగ బలి, దిష్టి కుంభ పూజలు నిర్వహించారు.
పట్టు వస్ర్తాలు, బంగారం, వెండి, ముత్యాల ఆభరణాలతో మనోహరంగా అలంకరించి కల్యాణ దంపతులు శ్రీలక్ష్మీనారసింహులను స్వర్ణ రథంపై అధిష్ఠింపజేశారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగహోమం చేపట్టారు. ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, వేద పారాయణీకులు మూలమంత్ర జపపఠనం, వేదపారాయణాలు పఠించి హారతినివేదన చేశారు. అనంతరం రథాంగరూఢుడైన లక్ష్మీనృసింహుడిని భక్తజనులు దర్శించుకున్నారు. రథస్థ కేశవుడిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, మరిగంటి శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు గజవెల్లి రమేశ్బాబు, దోర్బల భాస్కర్శర్మ, సూపరింటెండెంట్ రాజన్బాబు పాల్గొన్నారు.
స్వర్ణమయం.. దివ్య విమాన రథం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఇక నుంచి స్వర్ణ రథంపై ఊరేగనున్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీలోగిళ్లు, ల్యాండ్ మార్క్ డెవలపర్స్ సంస్థలు సంయుక్తంగా రూ.75 లక్షల విరాళం సమర్పించగా తమిళనాడుకు చెందిన చెన్నై స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ రథాన్ని తీర్చిదిద్దింది. పూర్తి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వర్ణ రథం రూపొందించారు. లక్ష్మీనరసింహ స్వామి రూపం, ద్వారపాలకుడు, గరుఢ ఆళ్వారుతోపాటు చేతులతో స్వాగతం పలుకుతూ మొక్కే భక్తుల ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వర్ణరథాన్ని సమకూర్చే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని శ్రీలోగిళ్లు డెవలపర్స్ డైరెక్టర్ వంటేరు సురేశ్రెడ్డి అన్నారు. స్వర్ణ రథానికి దాతల సహకారం యాదాద్రి చరిత్రలో నిలిచిపోనున్నదని ఆలయ అధికారులు, అర్చకులు అభిప్రాయపడ్డారు.
అలంకార సేవలో ఆత్రేయాచార్యులు
అతడి చేయి పడితే ఉత్సవాలకు ప్రత్యేక శోభ వస్తుంది. భక్తుల మనస్సు చూరగొనేలా దేవుళ్ల విగ్రహాలను అలంకరిచడంలో ఆయన దిట్ట. బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు, దశావతారాలు, శ్రీకృష్ణలీలలు.. ఇలా ఉత్సవం ఏదైనా ఆయన తీర్చిదిద్దిన అలంకారాల్లో భక్తులు పరవశం చెందాల్సిందే. నేటి ఆండ్రాయిడ్ యుగంలోనూ అలంకరణ వృత్తిపై మమకారం పెంచుకుని రాణిస్తున్నాడు.. శృంగారం ఆత్రేయాచార్యులు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఆత్రేయాచార్యులు దేవతామూర్తులను అలంకరిచడంలో దిట్ట. తెలుగురాష్ర్టాల్లోనే గాకుండా పొరుగు రాష్ర్టాల్లోనూ జరిగే ఉత్సవాల్లో దేవీ, దేవతల విగ్రహాలను అలంకరిస్తుంటారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని నిత్యనూతనంగా అలంకరించి భక్తుల అభిమానాన్ని చూరగొన్నాడు.
వంశపారంపర్యంగా..
అలంకార విద్య తనకు వంశపారంపర్యంగా వచ్చిందని ఆయన తెలిపారు. తాత కృష్ణమాచార్యులు అలంకరణలో సిద్ధహస్తులని, తాత నుంచి తండ్రి రమణాచార్యులకు, ఆ తర్వాత తనకు ఈ విద్య వచ్చిందన్నారు. 18వ ఏట నుంచే ఉత్సవాల్లో దేవతామూర్తులకు అలంకారం చేస్తున్నట్లు వివరించారు. ఏ విగ్రహాన్ని అలంకరించడానికైనా తనకు సుమారు మూడు గంటల సమయం పడుతుందని ఆత్రేయాచార్యులు తెలిపారు. అవతారానికి తగ్గట్టు వస్ర్తాలు, అభరణాలు, ఇతర అలంకరణ సామగ్రిని తానే తెచ్చుకుంటానని, తుదిమెరుగులు దిద్దేందుకు పుష్పాలు, దళాలు సమకూర్చాల్సి ఉంటుందని చెప్పారు.