పక్కాగా లెక్కలు తేలాకే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు
వయో పరిమితి పెంపుతో అందరికీ అవకాశాలు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణతో తీపికబురు
జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు
ఊరూవాడ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసిన నిరుద్యోగులు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు
యాదాద్రి భువనగిరి, మార్చి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి);కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. గతంలోనే భారీగా ఉద్యోగాల భర్తీ
చేపట్టిన ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగ యువత ఆనందానికి అవధుల్లేక పోయింది. వయో పరిమితి పెంపు, 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి తదితరులు అసెంబ్లీ చాంబర్లో కలిసి ఉమ్మడి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.నీళ్ల కోసం తండ్లాడిన తెలంగాణ నేడు కృష్ణా, గోదావరి జలాలతో పచ్చబడ్డది. ఒక్క రూపాయి కూడా ఇవ్వం.. ఏం చేసుకుంటారో చేసుకోండన్న నాటి సమైక్య పాలకుల అహంకారానికి దీటైన బదులు చెప్తూ నిధుల వరదతో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. నియ్యత్ గల సర్కారు పాలనలో ఇప్పుడు నియామకాల వంతొచ్చింది.
నిరుద్యోగ సమస్యను
తీర్చేందుకు సీఎం కేసీఆర్ తొలి శాసన సభ సమావేశాల్లోనే ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు. ఏడున్నరేండ్లలో పోలీస్ శాఖలో ఖాళీలు ఎక్కువగా భర్తీ చేయగా.. టీఎస్పీఎస్సీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ల ద్వారా వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. తాజాగా.. రాష్ట వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయడంతోపాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల సాధన కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో సీఎం కేసీఆర్ ప్రకటన కొత్త ఆశలను చిగురింపజేస్తున్నది.
రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ప్రకటన..
అసెంబ్లీ సాక్షిగా భారీ ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించిన మార్చి 9 రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నోటిఫికేసన్ ప్రకటించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. నిరుద్యోగ యువతకు మంచి రోజులు వచ్చాయి. పక్కా ప్రణాళికతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఏండ్ల తరబడి తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరించడం రాష్ట్ర ప్రభుత్వ ఔదార్యానికి నిదర్శనం. సీఎం కేసీఆర్ ప్రకటనతో వేలాది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు దక్కే విధంగా అద్భుతమైన విధానాన్ని స్వాగతిస్తూ నిరుద్యోగులు సంబురాలు జరుపుకొంటున్నారు.
– పైళ్ల శేఖర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
యువతలో ఆనందం నింపిన సీఎం కేసీఆర్
శాఖల వారీగా అన్ని ఖాళీలు భర్తీ చేస్తామంటూ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో యువతలో సంతోషం వెల్లివిరిసింది. పట్టణాలు, గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన రాష్ర్టానికి సార్థకత చేకూరింది. రాష్ట్రంలో ఒకే సారి సుమారు లక్ష ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత కలలు సాకారం కాబోతున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– గోలి ప్రణితాపింగళ్రెడ్డి, జడ్పీ స్థాయీ సంఘం చైర్పర్సన్
నిరుద్యోగుల పాలిట దైవం సీఎం కేసీఆర్..
నిరుద్యోగుల పాలిట ప్రత్యక్ష దైవం ముఖ్యమంత్రి కేసీఆర్. గత సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ నియామకాల్లో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ పరిష్కరిస్తూ సుమారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడం గొప్ప విషయం. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక మార్గమని కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమ దివిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం సంతోషకరం. ఇలాంటి ముఖ్యమంత్రి దేశానికే గర్వకారణం.
– మిర్యాల శ్రీనివాస్, టీఆర్ఎస్వై రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి కలెక్టరేట్
ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో వేలాది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. ఏండ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో జీవితాలు గడుపుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆనందంగా ఉన్నారు. గతంలోనే రెగ్యులరైజ్ చేయాలని ప్రయత్నించినా కొంత మంది కోర్టు ద్వారా ఆపడానికి ప్రయత్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు.
– ఎన్.రమేశ్, కాంట్రాక్ట్ లెక్చరర్, భువనగిరి
కాంట్రాక్ట్ లెక్చరర్లు కేసీఆర్ సారుకు రుణపడి ఉంటారు..
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జీఓ నంబర్ 16 విడుదల చేసి కుట్రదారుల పన్నాగాలను పటాపంచలు చేస్తూ అనేక అడ్డంకులను తొలగించారు. శ్రమ దోపిడీ, బానిసత్వానికి చరమగీతం పాడుతూ కాంట్రాక్టు ఆధ్యాపకుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని ప్రతి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులంతా జీవితాంతం రుణపడి ఉంటారు.
– జిల్లా నర్సింహ, తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, యాదాద్రి
పూర్తి స్థాయిలో తీరనున్న పాలనా ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాను, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త పంచాయతీలు, పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసింది. అందుకనుగుణంగా ఉద్యోగాల భర్తీని సైతం చేపడుతున్నది. గతంలో ఏడాదికి ఒక్కసారి కూడా గ్రామాలకు రాని కలెక్టర్.. నేడు ఎప్పుడు పడితే అప్పుడు సందర్శించి పనులు పర్యవేక్షిస్తున్నారు. వివిధ శాఖల అధికారుల పర్యటనలతో ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూడా జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ పెరిగింది. దాంతో మారుమూల మండలాల్లోనూ అభివృద్ధి వేగం పెరిగింది. పాలనా సౌలభ్యం కోసం జూనియర్ పంచాయతీ అధికారుల నియామకాన్ని పెద్ద ఎత్తున చేపట్టగా.. వివిధ శాఖల్లో దీర్ఘకాలికంగా ఉన్న పోస్టులను సైతం అడపాదడపగా భర్తీ చేస్తున్నది. తాజాగా.. మరిన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం పూనుకుంటుండడంతో పూర్తి స్థాయి సిబ్బంది సమకూరి పాలనా పరంగా ఇబ్బందులు తీరనున్నాయి.
నూతన జోనల్తో ఉద్యోగులందరికీ సమానావకాశాలు
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆర్డర్ టు సర్వ్ విధానంలో ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. జోనల్ వ్యవస్థ పునర్వవస్థీకరణ తర్వాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఉద్యోగుల క్యాడర్ ఖరారు కావడంతో శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతున్నది. కొత్తగా నియమితులైన వారికి సైతం జోనల్ కేటాయింపులు ప్రయోజనం కల్గించనున్నాయి. బదిలీలు, పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులందరికీ సమానావకాశాలు దక్కనున్నాయి. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని కొత్త జోనల్ వ్యవస్థ కల్పించడంతో ఉద్యోగ వర్గాల్లోనూ సంతోషం వ్యక్తమవుతున్నది.
స్థానికులకే సింహభాగం ఉద్యోగాలు…
విద్య, ఉద్యోగాల సాధన విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పాత జోన్-6 పరిధిలో తనదైన ముద్రను కలిగి ఉన్నది. ఇప్పుడు పాత స్వరూపం మారిపోగా… కొత్తగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు జనగామ జిల్లా పరిధిలోని వారితో ఇక మీదట పోటీ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానికులకు 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ పునర్వ్యవస్థీకరించిన నూతన జోనల్ వ్యవస్థ అనుకూలం కానున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నోటిఫికేషన్ రానున్న 1,010 ఉద్యోగాలను స్థానికులే దక్కించుకోనున్నారు. అలాగే మల్టీజోన్-2లో ఉన్న 2,160 పోస్టులకు సైతం జిల్లా వాసులు పోటీపడి ఉద్యోగాలు పొందే అవకాశం నూతన జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో కలిగింది. అలాగే జిల్లాలో 800 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తుండగా వారందరినీ క్రమబద్ధీకరించనున్నది.
జిల్లాలో 1,010 పోస్టుల భర్తీ
జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లతోపాటు మహిళా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కలిపి 21 వరకు ఉండగా.. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2018, 2020లో 300పోస్టులు భర్తీ అయ్యాయి. 712 ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో 3,425 మంది ఉపాధ్యాయులకు గాను ప్రస్తుతం 2,852 మంది ఉన్నారు. ఇంకా 613 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నది. రెవెన్యూ శాఖకు సంబంధించి తాసీల్దార్, డిప్యూటీ తాసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యారోగ్య, వ్యవసాయ, పశు సంవర్ధక, మున్సిపల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో పోస్టులను తాజాగా భర్తీ చేయనున్నారు.