కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 25 : కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ను సవరించి ప్రజాసంక్షేమం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండమడుగు నర్సింహ, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి దాసరి పాండు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.39.45లక్షల కోట్ల బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చి సామాన్య ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. నిరుపేదలకు, రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేసి కార్పోరేట్ పన్నుల రాయితీని 12 నుంచి 7శాతానికి, ప్రైవేటు పరిశ్రమలకు 18 నుంచి 15 శాతానికి తగ్గించిందన్నారు. గత బడ్జెట్లో రూ.2.86వేల కోట్లు ఉన్న ప్రజాపంపిణీ కేటాయింపులు ఈ సారి రూ.2.06వేల కోట్లకు తగ్గించారని పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీని రూ.4,380 కోట్లకు కోత విధించడం దారుణమన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనంరాజు, గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ రమేశ్నాయక్, సీఐటీయూ నాయకులు యామకృష్ణ, యాదగిరి, బాలకృష్ణ పాల్గొన్నారు.
బీబీనగర్లో
బీబీనగర్ : సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బండారు శ్రీరాములు, ఒవల్దాస్ కొండల్, ఎల్లంల సత్యనారాయణ, సురేశ్ బాబు, పవన్ కుమార్, స్వామి, నాగరాజు పాల్గొన్నారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న మోదీ
సంస్థాన్ నారాయణపురం : పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని సీపీఎం జిల్లా నాయకుడు దోనూరి నర్సిరెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించకుంటే రాబోయే రోజుల్లో మోదీకి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాసాచారి, మండల కార్యదర్శి యాదిరెడ్డి, నాయకులు నర్సిరెడ్డి, నర్సింహ్మ పాల్గొన్నారు.
యాదాద్రిలో నిరసన
యాదాద్రి : యాదగిరిగుట్ట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల ప్రజా సంఘాల నాయకులు బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం, హమాలీ యూనియన్ పట్టణాధ్యక్షుడు కొత్త స్వామి, కార్యదర్శి వెంకటేశం, కోశాధికారి శ్రీశైలం, రమేశ్, వెంకట్, శేఖర్ పాల్గొన్నారు.