– ప్రభుత్వ మాజీ విప్ సునీతా మహేందర్రెడ్డి
రాజాపేట, ఆగస్టు 26 : అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని మాజీ ప్రభుత్వ విప్ సునీతా మహేందర్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను తాము వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను, చేయాల్సిన పనులను మాత్రమే గుర్తు చేస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.600 కోట్లతో గంధమల్ల ప్రాజెక్టు, 4.2 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే మూడు గ్రామాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.2 టీఎంసీలకు కుదించినట్లు పేర్కొన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు 15వ ప్యాకేజీ ద్వారా రాజాపేట మండలానికి సాగునీరు అందించేందుకు రూ.12 కోట్లు మంజూరు చేసి, నాలుగు కిలోమీటర్ల మేర కాల్వ పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు.
గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏడాది క్రితం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసి పది నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి తీసిన దాఖలాలు కూడా లేవని సునీతా మహేందర్రెడ్డి ఆరోపించారు. భూ నిర్వాసిత రైతులకు వెంటనే పరిహారం అందించి గంధమల్ల రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాజాపేట మండలానికి సాగునీరు అందించి రైతుల కష్టాలు తీర్చాలని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తనకు వచ్చిన ‘నీళ్ల ఐలయ్య’ పేరును సార్థకం చేసుకోవాలని ఆమె సూచించారు. మాటలు కాకుండా చేతల్లో చిత్తశుద్ధి చూపించి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు.