గులాబీ వనాన్ని తలపించిన మైదానం
ఎండను సైతం లెక్కచేయక సీఎం కోసం నిరీక్షించిన జనం
మూడు ప్రతిష్టాత్మక భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
అందుబాటులోకి కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్
స్వరాష్ట్రంలో భువనగిరిలో అద్భుతమైన అభివృద్ధి
జిల్లా ఏర్పాటు తర్వాత పెరిగిన భూముల విలువ
హైదరాబాద్ – వరంగల్ కారిడార్లో ప్రగతి పరుగులు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో.. స్వపరిపాలనలో యాదాద్రి భువనగిరి జిల్లా నవశకాన్ని ప్రారంభించింది. పాలనా సౌలభ్యం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ పమేలా సత్పతిని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధిలో అద్భుతంగా పురోగమిస్తున్నదని, తెలంగాణ దేశానికి తలమాణికంగా తీసుకుపోతున్న పద్ధతిని ఇలాగే కొనసాగించాలని కోరారు. అంతకుముందు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, జిల్లా కేంద్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.
‘తెలంగాణ వస్తదని, భువనగిరి జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు. జిల్లా ఏర్పాటయ్యాక అభివృద్ధిలో దూసుకుపోతున్నది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు పోలీసులు గౌరవవందనం చేయ గా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతన కలెక్టరేట్లో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తాన్ని కలియదిరిగి చూశారు. కలెక్టర్ పమేలా సత్పతిని తన కార్యాలయంలోని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు.
సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపి ప్రసంగాన్ని ప్రారంభించారు. గతంలో బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో తప్ప మిగతా అన్ని రాష్ర్టాల్లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని, గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ సైతం మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించి చేయలేకపోయారని పేర్కొన్నారు. అప్పట్లో తాము జిల్లా ఏర్పాటుపై విజ్ఞప్తులు చేసినా అనేక రకాల అపోహలు, అవగాహన లేమితో జిల్లాల ఏర్పాటు కాలేకపోయాయన్నారు. తాను జిల్లాల ప్రక్రియ మొదలు పెట్టాలనుకున్నప్పుడు చత్తీస్ఘడ్ సలహాదారున్ని సంప్రదించి ప్రయోజనాలను తెలుసుకున్నట్లు తెలిపారు.
అధికారుల కృషితోనే అద్భుత అభివృద్ధి
ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధిలో పురోగమిస్తుందన్నారు. ‘తెలంగాణ వస్తే కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగులకు ఎక్కువ జీతాలిస్తామని చెప్పినం.. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నామని’ సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్రని, రానున్న రోజుల్లో ఉద్యోగులకు ఇంకా జీతాలు పెరుగుతాయని అన్నారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సరళంగా ఉండాలని, ఉద్యోగులు పదోన్నతుల కోసం పైరవీలు చెసే దుస్థితి పోవాలన్నారు. తమ ఉద్యోగాలు తమకు కావాలనే నినాదం తెలంగాణ ఉద్యమ సమయంలో ఉండేదని, ప్రస్తుతం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా నిబంధనలు తెచ్చామని తెలిపారు. తెలంగాణ ధనిక రా ష్ట్రం అయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృ షి చేస్తున్నారన్నారు. తెలంగాణలో మూడెకరాలు న్న రైతులు కోటీశ్వర్లని, దళితులు బాగుపడాలనే దళితబంధుకు రూకల్పన చేశామని పేర్కొన్నారు.
దేశానికే దిక్సూచి సీఎం కేసీఆర్ : మంత్రి జగదీశ్రెడ్డి
భువనగిరి కలెక్టరేట్ : దేశానికే దిక్సూచి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖలు ఉండేలా సమీకృత కలెక్టర్కు చర్యలు చేపట్టారన్నారు.
పట్టుబట్టి జిల్లాల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చాలామందికి అపనమ్మకం ఉన్నా సంపూర్ణంగా నమ్మి సాధించుకున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టుబట్టి జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఏర్పాటుతో భువనగిరి, యాదాద్రిలో భుముల ధరలకు రెక్కలొచ్చాయని, యాదగిరిగుట్ట, భువనగిరిలో భూముల ధరలు కోట్లు పలుకుతుండడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. గుట్టల ప్రాంతాల్లోని భూము లు కోట్లు పలుకుతుండగా.. మారుమూల ప్రాంతాల్లో సైతం ఎకరా రూ.25నుంచి 30లక్షలు పలుకుతున్నదని వివరించారు. భువనగిరి వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, త్వరలోనే హైదరాబాద్లో భువనగిరి కలిసిపోనుందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఉండేలా భువనగిరి- రాయగిరి రోడ్డు మారిందన్నారు. హైదరాబాద్-వరంగల్ కారిడార్ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని, అది తన కల అని సీఎం పేర్కొన్నారు. జనగామ, హనుమకొండ, భువనగిరి, వరంగల్, మేడ్చ ల్ ప్రాంతాలు జిల్లాల ఏర్పాటుతో బాగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గతంలో భువనగిరి, ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట లాంటి ప్రాంతాల్లో 900ఫీట్లు వేసిన నీరు రాకపోయేదని ఇప్పుడు 20 నుం చి 30ఫీట్లలోనే నీరు వస్తుందని తెలిపారు.
విద్యా విధానం బలోపేతం
విద్యావిధానం బలోపేతానికి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి మీద రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దాని ఫలితంగానే ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చూపిస్తున్నారన్నారు. పేద విద్యార్థుల విదేశీ చదువు కోసం రూ.25లక్షలు ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణనే అని సీఎం అన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్ అనేది ఎవరూ ఊహించలేదని, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఏర్పాటుతో పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని, దహన సంస్కారాలకు ఇబ్బందులు లేకుండా వైకుంఠధామాలు సైతం నిర్మించినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కృషిని ఇలాగే కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, సైదిరెడ్డి, నోముల భగత్, రమావత్ రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ
రానే రాదనుకున్న తెలంగాణ తెచ్చి దేశంలోనే నంబర్ వన్గా సీఎం కేసీఆర్ మారుస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. భువనగిరిలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ గతంలో భువనగిరి, ఆలేరు ప్రాంత ప్రజలు నల్లగొండ జిల్లాకు పోవడానికి పడుతున్న ఇబ్బందులు చూసి భువనగిరిని జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లా పరిపాలన సంస్కరణలో భాగంగా అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా జిల్లా సమీకృత సముదాయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. జిల్లా కార్యకర్తలకు డైరక్షన్ ఇవ్వడం కోసం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాణను అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ర్టాభివృద్ధిని తనే భుజస్కంధాలపై వేసుకుని దేశమే ఆశ్చర్యపోయేలా క్రమపద్ధతిలో పాలన సాగిస్తున్నారని కొనియాడారు. 8ఏండ్లలోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని రకాల పెన్షన్లు రూ.11వేల కోట్లు ప్రజలకు అందించారని ప్రసంగించారు. ఆకలితో ఉన్నవాళ్లకు ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా ఉంటూ జిల్లా ప్రజల దీవెనలు అందుకుంటున్నారని తెలిపారు.
ఎడారిగా మారుతున్న ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి వేలాది కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ కావచ్చు, మూసీ ప్రాజెక్టు కావచ్చు, సాగర్ ఎడమ కాల్వలో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి చివరి భూములకు నీరు అందించారన్నారు. వేల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలోని బస్వాపురం రిజర్వాయర్ నింపి కరువు ప్రాంతాలైన భువనగిరి, ఆలేరుతో పాటు సూర్యాపేట, తుంగతుర్తి వరకు బీడు భూములను సస్యశ్యామలం చేశామన్నారు. దేశంలో రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చుదిద్దుతున్న సందర్భంలో కేంద్రంలో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్కు పనే లేకండా చేయాలని దేశంలో కుట్రలు మొదలయ్యాయన్నారు. వారి కుట్రలను తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్కు ప్రమాదం తేవాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనం చేయాలని, తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రం ప్రభుత్వం, బీజేపీ కుట్రలను చిత్తు చేయాల్సిన సందర్భం వచ్చిందన్నారు.
–విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి