యాదాద్రి భువనగిరి : సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మతపిచ్చి లేపి కశ్మీర్ వ్యాలీలా మార్చుతున్నారు. ఇది అవసరమా దేశానికి. ఈ దేశ యువత.. రేపటిది మీ భవిత.. అని సీఎం కేసీఆర్ జిల్లాలోని రాయగిరి సభలో స్పష్టం చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా.. ఐటీ రంగంలో భారతదేశానికే సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీ.. కర్ణాటక రాష్ట్రం. దాని తర్వాత రెండో స్థానంలో ఉన్నది మన హైదరాబాద్ సిటీ.. తెలంగాణ రాష్ట్రం. కర్ణాటకలో ఏం జరుగుతున్నది మీకు తెలుసు కదా. ఆడపిల్లల మీద.. మన బిడ్డల మీద.. పసికూనల మీద రాక్షసుల్లా ప్రవర్తించవచ్చునా.. అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
ఈ దేశం ఈకో నాశనం అయితే ఎవరు పెట్టుబడి పెడతరు. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయి. ఈ తెలివి తక్కువ బీజేపీ పాలనలో ఇప్పటికే నష్టపోయాం. ఇది నా లెక్క కాదు. కుక్కల్లా ఎక్కడ పడితే అక్కడ అరవడం కాదు. దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగింది నిజం కాదా. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోవడం నిజం కాదా. సెప్టెంబర్లో 4.4 శాతం, అక్టోబర్లో 4 శాతం, నవంబర్ 1.4 శాతం, డిసెంబర్లో 0.4 శాతం. దీన్ని ఏమంటారు. మోదీ గారు ఇదేనా మీ ఉజ్వలమైన పాలన. దేశంలో 15 నుంచి 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డది నిజం కాదా. పొద్దున లేస్తే దేశంలో కర్ఫ్యూలు, లాఠీ చార్జీలు.. ఇదేనా దేశానికి కావాల్సింది. పిల్లల ఉద్యోగాలు ఉండాలన్నా.. రాష్ట్రానికి పెట్టుబడులు ఉండాలన్నా.. ఈ దేశం ముందుకు పోవాలన్నా.. కులం, మతం జాతి భేదం లేకుండా ముందుకు పోవాలి. అమెరికాలో 95 శాతం క్రిస్టియన్లు ఉంటారు. కానీ.. వాళ్లు ఏనాడూ మతపిచ్చి లేపరు. అందుకే అమెరికా ప్రపంచాన్ని శాసిస్తోంది. అనేక దేశాల్లో అనేక మంది ఉంటరు కానీ.. మత పిచ్చి లేపరు.. అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.