రాజాపేట, ఆగస్టు 05 : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, యునాని ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది రెగ్యులర్ విధులకు హాజరవుతున్నారా లేదా అని ఆరా తీశారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సరిపడ మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
నార్మల్ డెలివరీల బాధ్యత ఆశా వర్కర్లదే
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీల బాధ్యత ఆశా వర్కర్లే తీసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గర్భిణుల వద్దకు వెళ్లి బలవర్ధకమైన ఆహారం తీసుకునేలా, సహజ కాన్పుకు ఫిజికల్ యాక్టివిటీస్పై అవగాహన కల్పించాలన్నారు. దవాఖాన ఆవరణ పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో వెంటనే శుభ్రం చేయించాలని ఎంపీడీఓ నాగవేణిని ఆదేశించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.