బీబీనగర్, మే 22 : బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ పంచాయతీలో మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ యువజన సేవల సంస్థ సెట్విన్ మేడిపల్లి కో ఆర్డినేటర్ వనజ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి అవకాశాలను వివరించారు. ఈ సందర్బంగా సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో ఉపయోగ పడతాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు కసగోని అరుణ, బింగి లావణ్య, భాషబోయిన బాలప్రసాద్, అంకర్ల శ్రీనివాస్, మహిళా సంఘాల ప్రతినిధులు, వీబీకేలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.