యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్తగా వృద్ధాప్య పింఛన్ పొందాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆసరా పింఛన్ పొందేందుకు కనీస వయస్సును 57 ఏండ్లకు తగ్గిస్తూ నిర్ణయించిన ప్రభుత్వం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 31వరకు గడువు ఇచ్చి న ప్రభుత్వం..మీ సేవలో ఉచితంగానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం యాదాద్రిభువనగిరి జిల్లాలో 87,739 మందికి వివిధ రకాల పింఛన్లను నెలనెలా అందిస్తున్న ప్రభుత్వం ప్రతి నెలా రూ.19కోట్ల వరకు వెచ్చిస్తోంది.
ఓటరు లిస్టు ప్రకారం..57 ఏండళ్ల వయసు కలిగిన వారు 11,833 మంది ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ లెక్క తేల్చింది. ప్రస్తుతం ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన వెంటనే పరిశీలన జరిపి కొత్త వారికి పింఛన్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
వృద్ధాప్య పింఛను(ఆసరా) అర్హత వయసు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు కుటుంబంలో ఒకరిని గుర్తించి అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కొంతకాలం క్రితం జరిగిన మంత్రి మండలిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేయగా..గురువారం దరఖాస్తు చేసుకునేందుకు గాను మార్గదర్శకాలను విడుదల చేశారు. నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాక అర్హులను తేల్చి నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందిస్తారు.
పింఛన్లతో సబ్బండ వర్గాలకు అండ
ఒంట్లో సత్తువ లేక పనులు చేయలేని వృద్ధులు.. కాళ్లు, చేతులు వంకర్లు పోయి ఇంటికే పరిమితమైన దివ్యాంగులు..ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వితంతువులతో పాటు ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా పింఛన్లను అందించి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఠంచన్గా పింఛన్ అందిస్తూ ఆయా కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ రూ.200 ఉన్న పింఛన్ను రూ.2,016కు, రూ.500 ఉన్న పింఛన్ను రూ.3,016కు పెంచి ఇంటి పెద్దగా ఆదుకుం టున్నారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 87,739 కాగా..వీరికి పింఛన్లు అందించేందుకు ప్రతి నెలా ప్రభుత్వం రూ.19కోట్ల వరకు వెచ్చిస్తున్నది. వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏండ్లకు తగ్గించడంతో గతంలోనే గ్రామీణాభివృద్ది శాఖ ఓటరు లిస్టు ప్రకారం జిల్లాలో 11,833 మంది ఉన్నట్లు గుర్తించింది. ఈ ప్రకారంగా..జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు పొందే వారి సంఖ్య మరింతగా పెరగనుంది. ప్రతి కుటుంబంలో ఒకరికి లబ్ధి చేకూర్చేలా సీఎం కేసీఆర్ వయస్సును తగ్గించి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో నిరుపేద కుటుంబాల్లో సంతోషాలు విరబూస్తున్నాయి.
ఉచితంగానే దరఖాస్తు చేసుకునే అవకాశం
అర్హులైన వారు పుట్టిన తేది ధృవీకరణ, ఓటరు కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఈ సేవ/మీ సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం ఈ నెలాఖరు లోపుగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే సర్వీసు చార్జీని చెల్లిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వయసు ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకుంటే పంచాయతీలు, మున్సిపాలిటీల అధికారులు పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. గ్రామాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీలలో కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు.