యాదాద్రి, జనవరి 1 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారిం ది. ఆదివారం సెలవుదినంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ తిరు మాఢవీధులు, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు కిటికిటలాడాయి. స్వామి దర్శనానికి భక్తులు గంటల కొద్ది క్యూలైన్లు నిలుచున్నారు. కొండకింద, కొండపైన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 6గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు
యాదాద్రీశుడి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర ్ణపుష్పార్చన పూజలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతును జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు.
రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయ ంత్రం వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సుమారు 60వేల మంది భక్తులు స్వా మివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానకు రూ.75,94,285 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రీశుడిని జిల్లా న్యాయమూర్తి బాల భాస్కర్ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తొలిసారి ఉత్తర ద్వార దర్శనం సంతోషదాయకం :మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా భక్తుల చిరకాల వాంఛ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం సోమవారం భక్తులకు కలగడం సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాదాద్రి చరిత్రలోనే తొలిసారిగా స్వామివారు ఉత్తర ద్వారం వద్దకొచ్చి భక్తులకు వరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం మంత్రి కుటుంబ సమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వయంభువుడి దర్శనానంతరం విలేకరుతో మాట్లాడారు. కేంద్రం సహకరించకపోయినా భగవంతుడి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పోతున్నదన్నారు. దీంతో రైతులు, సామాన్యులు ప్రతి ఒక్క రూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. 40ఏండ్లుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ఏ కార్యక్రమం చేపట్టినా స్వామివారి ఆశీర్వచనంతో మొదలు పెడుతామని తెలిపారు. కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
భక్తుల వసతి గృహం నేడు ప్రారంభం
యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తులు సేద తీరేందుకు దాతల సహకారంతో నిర్మించిన వసతి గృహాన్ని మంత్రులు ఆలోల్ల ఇంద్రకరణ్రెడ్డి, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సోమవారం ప్రారంభిస్తారని ఈఓ ఎన్.గీత తెలిపారు. కొండపైన ఈఓ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొండ కింద తులసీ కాటేజ్ ప్రాంతంలోనే పలువురు దాతల సహకారంతో మరో ఆరు అంతస్తులతో కూడిన సదనం నిర్మించామని ఇందులో 240 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రూ.12లక్షల వ్యయంతో కొన్ని, రూ.6లక్షలు, రూ.5లక్షల వ్యయంతో మరికొన్ని గదులు అన్ని సౌకర్యాలతో నిర్మించామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా భవనంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామన్నారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా వసతిగృహానికి నామకరణం చేయనున్నట్లు తెలిపారు.