యాదగిరిగుట్ట, యాదాద్రి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Laxminarasimha Swamy) ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకృష్ణారావు (EO Rama Krishna rao ) తెలిపారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసాద కౌంటర్లు లడ్డూలు, పుళిహోర, అభిషేకం లడ్డూలను నిరంతరాయంగా విక్రయిస్తామని, ఇందు కోసం 50 వేల నుంచి 60 వేల వరకు లడ్డూలను తయారు చేయిస్తున్నామని తెలిపారు. ఆలయాల ప్రాంతాలు ఎప్పటికప్పుడూ పరిశుభ్రత, మంచినీటి , భక్తుల రద్దీకి అనుగుణంగా కొండపైకి టీఎస్ ఆర్టీసీ(RTC) ఉచిత బస్సులను నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు . రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తును సైతం పెంచుతున్నామని పేర్కొన్నారు.