భువనగిరి అర్బన్, జూలై 06 : అంబేద్కర్ భవనంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భవనం నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన నిర్మాణ పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఇంకా పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ భవనానికి అవసరమైన మౌలిక వసతులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనం ముందు సీసీ రోడ్డు నిర్మాణం, గ్రీనరీ అభివృద్ధి, పరిసరాల సుందరీకరణ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భవనాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడే విధంగా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.