భువనగిరి అర్బన్, జూలై 14: జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఓ మోస్త్తరు వర్షం కురిసింది. భువనగిరిలో 1.0 మీ.మీ, బీబీనగర్ మండలంలో 1.2 మీ.మీ, భూదాన్పోచంపల్లి మండలంలో 4.2 మీ.మీ, చౌటుప్పల్ మండలంలో 6.4మీ.మీ, రామన్నపేట మండలంలో 3.2 మీ.మీ, వలిగొండలో 4.6 మీ.మీ, ఆత్మకూరు(ఎం)లో 2.8 మీ.మీ, మోత్కూరులో 4.2 మీ.మీ, గుండాలలో 6.8 మీల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. సంస్థాన్నారాయణపురం మండలంలో 36.2 మీమీ అత్యధిక వర్షంపాతం నమోదుకాగా బొమ్మలరామారం మండలంలో 0.6 మీల్లి మీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైంది.
చెరువు కాల్వలో దొరికిన పెద్ద చేప
ఆత్మకూరు(ఎం), జూలై14: మండల కేంద్రంలోని వీర్ల చెరువుకు రాయిపల్లిలోని బిక్కేరు వాగు పై నిర్మించిన ఆనకట్ట నుంచి కాల్వ ద్వారా వచ్చే నీటిలో బుధవారం చేపలు ఎదురెక్కి వచ్చాయి. ఆత్మకూరు, రాయిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చేపల కోసం వెళ్లారు. కాల్వలో చేపలు పడుతుండగా మండల కేంద్రానికి చెందిన మద్దెల సాయిరామ్కు 5కిలోల రవ్య చేప దొరికింది.
పంట కాల్వలో ప్రవహిస్తున్న వరద
ఉపాధి హామీ పథకం ద్వారా మండల కేంద్రంలో పంట కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో పాటు వరద పంట కాల్వల ద్వారా ప్రవహిస్తూ గ్రామంలోని కొత్త చెరువు, బూతుకుంటలోకి వెళ్లింది. ప్రతి నీటి బొట్టు వృథా కాకుండా పంటకాల్వల నిర్మాణం చేపట్టడాన్ని రైతులు హర్షిస్తున్నారు.
నీటి కాల్వకు పడ్డ గండ్ల పూడ్చివేత
మండలంలోని మొరిపిరాలలో కొత్త చెరువులోకి నీళ్లు వచ్చేందుకు తీసిన కాల్వకు మంగళవారం గండ్లు పడి నీరు వృథాగా పోయింది. బుధవారం సర్పంచ్ సామ తిర్మల్రెడ్డి కాల్వ పడ్డ గండ్లను పూడ్చి వేయించారు.