యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 24 : బస్వాపూర్ వద్ద నిర్మిస్తున్న నృసింహ రిజర్వాయర్లో భాగంగా ముంపునకు గురవుతున్న యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్తండా గ్రామస్తులకు మండలంలోని దాతరుపల్లిలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తండావాసులకు ప్రభుత్వం అందజేయనున్న ప్యాకేజీ, పునరావాసం తదితర అంశాల గురించి గురువారం తండావాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు. లప్పానాయక్తండా గ్రామంలో 263 కుటుంబాలు ప్యాకేజీకి అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ముంపు బాధితులకు ఇంటి నిర్మాణ విలువ, ఇంటి స్థలానికి గల విలువతోపాటు ప్యాకేజీల కింద మొత్తం రూ. 7.61లక్షలు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు చెప్పారు. వీరికి దాతరుపల్లిలోని 294 సర్వే నంబర్ అసైన్ ల్యాండ్లో పునరావాసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఒక్కొక్కరికి 200 గజాల ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించుకోవడానికి ఇందిరా ఆవాస్ యోజన పథకం ద్వారా రూ. 1.25 లక్షలు ఇస్తామని వివరించారు. 7.61 లక్షల ప్యాకేజీలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నందుకు ఉపాధి నిమిత్తం రూ. 5 లక్షలు, సబ్ సిస్టింట్ ప్యాకేజీ కింద రూ. 36 వేలు, ఇంటి సామాన్లు, తదితర రవాణా సదుపాయాల కోసం రూ. 50 వేలు, వన్టైం రిసెటిల్మెంట్ అలవెన్స్ ద్వారా రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో పాటు పశువుల దొడ్లు, గొర్రెల షెడ్లు ఉన్నవారికి రూ. 25 వేలు, చేతి వృత్తులు ఉన్న వారికి రూ. 25 వేలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను డిసెంబర్ 24, 2021న విడుదల చేయగా రెండు నెలల తర్వాత ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో ఈ ప్యాకేజీని బాధితులకు అందజేస్తామని, గ్రామస్తుల కోరిక మేరకు నృసింహ రిజర్వాయర్లో ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. కాగా తండావాసులు తమకు ఇంటి నిర్మాణంలో భాగంగా డబుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలని, పునారావసం కల్పించే చోట ఆట స్థలానికి ఐదు ఎకరాల్లో గ్రౌండ్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామస్తుల వినతులను కలెక్టర్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఏఓ ఉపేందర్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ ఖుర్షిద్, తాసీల్దార్ రామునాయక్, కలెక్టర్ ఆఫీస్ సూపరింటెంటెండ్ రామారావు, ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ బుజ్జి శంకర్నాయక్ పాల్గొన్నారు.