మోటకొండూర్, ఫిబ్రవరి 23 : రైతు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకే సీఎం కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేశారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మాటూరు, చందేపల్లి గ్రామాల్లో బుధవారం ఆమె రైతు వేదికలను ప్రారంభించి మాట్లాడారు. రైతు వేదికలతో ఇచ్చిన సలహాలతో సాగు విస్తీర్ణం రెండు రెట్లు పెరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో రైతు బీమా, రైతు బంధు పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. మండలానికి రైతు బంధుతో రైతులకు సుమారు రూ.100కోట్లను అందించామన్నారు. రైతులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమం కోసం అనేక ఫలాలను అందిస్తున్నారన్నారు. రైతు వేదికల ఏర్పాటుతో రైతులకు సాగు సమస్యలు తీరుతున్నాయని తెలిపారు. అంతకుముందు ఆయా రైతు వేదికల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం మోటకొండూరు మండలంలోని దిలావర్పూర్, ఇక్కుర్తి, మాటూరు, అమ్మనబోలు, వర్టూర్, చందేపల్లి, చామాపూర్, తేర్యాల గ్రామాల్లో ప్రత్యేక నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనూరాధ, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్, మండల వ్యవసాయాధికారి సుబ్బూరి సుజాత, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దూదిపాల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మల్లేశ్, డైరెక్టర్లు బీస కృష్ణంరాజు, అనంతుల జంగారెడ్డి, కో ఆప్షన్ మండల సభ్యుడు ఎండీ.బూరాన్, ఎంపీటీసీలు పన్నాల అంజిరెడ్డి, జ్యోతిలక్ష్మి, సర్పంచులు పోతిరెడ్డి స్వప్న, చామకూర అమరేందర్రెడ్డి, సిరిపురం నర్మద పాల్గొన్నారు.