శ్రీవారి ఖజానాకు రూ.8,19,732
యాదాద్రి, ఫిబ్రవరి 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయంలో కవచమూర్తులను పట్టువస్ర్తాలు, పూలమాలలతో అలంకరించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించి తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చనలు చేశారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన పూజలు చేశారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ. 8,19,732 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
హుండీల ఆదాయం రూ.98,12,570
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి 24రోజుల హుండీల ఆదాయం రూ. 98,12,570 వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో గురువారం హుండీలు లెక్కించారు. మిశ్రమ బంగారం 93 గ్రాములు, వెండి రెండు కిలోల 900 గ్రాములు వచ్చిందని తెలిపారు.