15వరకు ఉత్సవాల నిర్వహణ
మూడు రోజులు వైభవంగా నిర్వహణ ఏర్పాట్లు
చేస్తున్న యాదాద్రి ఆలయ అధికారులు
వివరాలు వెల్లడించిన ఈఓ గీత
యాదాద్రి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయాల్లోనూ ఉత్సవాలు ఘనంగా జరిపించనున్నట్లు యాదాద్రి ఆలయ ఈఓ గీత తెలిపారు. మూడు రోజులపాటు జరిగే పూజా కార్యక్రమాల వివరాలను ఆమె వెల్లడించారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయమైన పాతగుట్ట సహా జనగామ జిల్లా బచ్చంపేట మండలం దుబ్బగుంటపల్లి యోగానంద నర్సింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13నుంచి 15వరకు స్వామివారి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.గీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానాలయ పునర్నిర్మాణం అనంతరం జరిగే మొదటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జయంత్యుత్సవాల వివరాలు
ప్రధానాలయంలో
13న : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బాలాయంలో ఈ నెల 13న ఉదయం 9.30గంటలకు జయంత్యుత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, పూణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కుంకుమార్చన చేపట్టి తిరు వేంకటపతి అలంకార సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణం, హవనం నిర్వహించి, గరుఢ వాహన, పరవాసుదేవ అలంకార సేవ చేపట్టనున్నారు.
14న : ఉదయం 9గంటలకు నిత్య మూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవ, సాయంత్రం 6గంటలకు నృసింహ మూల మంత్ర హవనం, హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకారసేవ నిర్వహిస్తారు.
15న : ఉదయం 7గంటలకు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో మూలమంత్ర హవనం, ఉదయం 9గంటల నుంచి 9.30గంటల వరకు పూర్ణాహుతి అనంతరం సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం 7గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించనున్నారు.
పాతగుట్టలో..
13న : పాతగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఉదయం 9.30గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, రక్షా బంధనం, లక్ష పుష్పార్చన, సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ నిర్వహిస్తారు.
14న : ఉదయం 9.30గంటలకు విశేష స్నపనం, నిత్య హవనం, నృసింహ మూలమంత్ర హవనం లక్ష పుష్పార్చన, సాయంత్రం 6గంటలకు నృసింహ మూలమంత్ర హవనం నిర్వహించనున్నారు.
15న : ఉదయం 9.30గంటలకు నిత్య హవనం, పూర్ణాహుతి, అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 7గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహిస్తారు.
దుబ్బగుంటపల్లిలో..
16న : ఉదయం 9గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, అభిషేకం ఉదయం 11గంటలకు స్వామి కల్యాణం, మహానివేదన, తీర్థ ప్రసాద వియోగం, ఆశీర్వచనం చేపట్టనున్నారు.
ఆర్జిత పూజలు తాత్కాలికంగా నిలిపివేత..
జయంత్యుత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జిత పూజలైన సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఓ తెలిపారు.