యాదాద్రి, మే 31: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి మంగళవారం ఆకుపూజ నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి, తమలపాకులతోఅర్చించి లలితాపారాయణం చేశారు. పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆంజనేయస్వామివారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
యాదాద్రి స్వయంభూ ప్రధానాలయంలో నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు చేపట్టి, ఉదయం ఆరగింపు నిర్వహించారు. ఉదయం 5.15 నుంచి 6.15 గంటల వరకు స్వామివారికి నిజాభిషేకం కోలాహలంగా జరిపారు. అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయ ప్రాకారంలో లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. సాయంత్రం ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింది పాత గోశాల వద్ద సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని, వ్రత మాచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. వివిధ విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 23,68,698 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి 7 రోజుల హుండీ ఆదాయం రూ. 70 లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరితహోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.70,57,165 ఆదాయం వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 29 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 400 గ్రాములు వచ్చిందని తెలిపారు. దాంతో పాటు అమెరికాకు చెందిన 331 డాలర్లు, సోమాలియాకు చెందిన 1,000 శిల్లింగ్స్, అరబ్కు చెందిన 10 దిరామ్స్, ఖతార్ రియాల్కు చెందిన 1 రియాల్, ఆస్ట్రేలియాకు చెందిన 20 డాలర్లు, మలేషియాకు చెందిన 1 రిగ్గిట్ స్వామివారికి సమకూరినట్లు ఈ తెలిపారు.