యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారుతున్నది. స్వయంభువుడిని
దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత అక్కడి రూపురేఖలే మారిపోయాయి. ఆలయంలో శిల్ప కళా సౌందర్యం, దేవతావిగ్రహాలు, వసతులు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. ఇల వైకుంఠాన్ని తలపిస్తున్నాయి.
దేశ, విదేశాల భక్తులను ఆకర్షిస్తున్నాయి. అద్భుతంగా రూపుదిద్దుకొని ఆరేండ్ల తర్వాత ప్రారంభమైన దేవస్థానానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతున్నది. గతంలో రోజుకు 5 నుంచి 10 వేలు, సెలవుదినాల్లో 15 నుంచి 20 వేలమంది భక్తులు దర్శనానికి రాగా నేడు ఆ సంఖ్య నాలుగింతలు పెరిగింది.స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే భక్తుల వసతులు దాదాపు అందుబాటులోకి రాగా మరికొన్ని చేపడుతున్నారు. మిగిలిన ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
– యాదాద్రి, మే25
యాదాద్రి స్వయంభూ పంచనార సింహుడి ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. గతంలో రోజుకు
5 నుంచి 10 వేల మంది, సెలవు దినాలతోపాటు శని, ఆదివారాల్లో 15 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చేది. దీంతో హుండీ ఆదాయం 20 రోజులకోసారి లెక్కించేవారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయపునఃప్రారంభమైన అనంతరం భక్తుల రద్దీ భారీగా పెరుగుతూ వస్తున్నది. రోజుకు 20 నుంచి 25 వేల మంది వరకు, సెలవు దినాలతోపాటు శని, ఆదివారాల్లో 50 నుంచి 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం రోజువారి ఆదాయం సుమారు 15 లక్షలకు పైగా ఉండగా.. శని, ఆదివారాల్లో 25 నుంచి 30లక్షల వరకు సమకూరుతున్నదని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం రాష్ట్రంలోనే పేరుగాంచింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు లడ్డూ, పులిహోర రుచి చూడకుండా ఉండరు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి ప్రసాదాలను పూర్తిగా యంత్రాలతోనే తయారు చేస్తున్నారు. ఇందుకోసం శివాలయం వెనుక భాగంలో ప్రసాద భవనాన్నినిర్మించారు.
భక్తుల తాకిడి పెరిగిన నేపథ్యంలో స్వామివారి ప్రసాద విక్రయాలు భారీగా పెరిగాయి. రోజువారీగా ప్రసాద విక్రయాలతో రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నది. శని, ఆదివారాల్లో రూ.15 లక్షలకు పైగా వస్తున్నది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు 12 కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రసాదాలను విక్రయిస్తున్నారు.
యాదాద్రి ఆలయ క్యూలైన్లలో వృద్ధులు, దివ్యాంగుల కోసం బిగించిన ఎస్కలేటర్ అందుబాటులోకి వచ్చింది. క్యూ కాంప్లెక్స్ మొదటి అంతస్తు నుంచి చివరి అంతస్తు గల ప్రసాద విక్రయ శాల వద్దకు మూడు ఎస్కలేటర్లను నిర్మించారు.
ప్రధానాలయం ఉత్తర దిశలో క్యూ కాంప్లెక్స్ ముందు ప్రదేశంలో అధునాతన బస్బే నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. సుమారు ఎకరన్నర స్థలంలో నిర్మించే ఈ బస్బే పూర్తి ఆధ్యాత్మికత వెల్లివిరిసే విధంగా నిర్మాణం చేపట్టారు. బస్బే ప్రాంగణంలో మొత్తం 16 ఫ్లాట్ఫామ్లు నిర్మించారు. ఇందులో 8 కొండపై నుంచి వచ్చేందుకు, మరో 8 ఫ్లాట్ఫామ్లు కిందికి వెళ్లే విధంగా నిర్మాణాలు జరిగాయి. బస్సు దిగిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే క్యూ కాంప్లెక్స్కు ప్రత్యేకమైన దారిని నిర్మించారు.
భక్తుల వాహనాలు నిలిపేందుకు పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్లు, ఆ పక్కనే కారు పార్కింగ్కు ప్రత్యేకమైన రెండు ఫ్లాట్ఫామ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇందులో ఒక ఫ్లాట్ఫామ్లో 22 కార్లు, మరో దాంట్లో 30 కార్లు పార్కింగ్ చేసే విధంగా నిర్మాణాలు చేపట్టారు. ఆ పక్కనే 1.5 మీటర్ల బారికేడ్ నిర్మిస్తున్నారు. మరో వైపు బస్ బేలో ఇతర అవసరాల నిమిత్తం వచ్చే సర్వీస్ వాహనాల కోసం 7.50 మీటర్ల ప్రత్యేక ప్రవేశ దారిని నిర్మిస్తుండగా.. ఇందుకు కావాల్సిన పనులు కొనసాగుతున్నాయి.
యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు నిర్మించిన ప్రథమ, ద్వితీయ ఘాట్ రోడ్లు కలిసే ప్రదేశంలో మహాద్భుత స్వాగత ఆర్చి భక్తులకు స్వాగతం పలుకనుంది. 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో రెండు మార్గాలు ఉండేలా తీర్చిదిద్దుతుండగా పనులు తుది దశకు చేరుకున్నాయి. భక్తులు మొదటి ఘాట్రోడ్డు నుంచి యాదాద్రి కొండపైకి వచ్చే విధంగా, రెండో ఘాట్ రోడ్డు నుంచి తిరిగి కిందికి వెళ్లే విధంగా వేర్వేరుగా మార్గాలు ఉండేలా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.
స్వాగత తోరణాలపై దేవతామూర్తుల చిత్రాలను పొందుపరిచారు. సాలాహారాలు రూపొందించారు. దీంతోపాటు కాకతీయ పిల్లర్లు, వాటిపై సింహాకృతులు, ఐరావతాలు, గోపురాలు నిర్మించారు. ఆర్చిపైన కలశాకృతులు, శంకుచక్ర, తిరునామాలు, అద్భుతమైన కిటికీలు, కాకతీయ తోరణాలు, దేవతామూర్తుల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఆర్చిపైన గల సాలాహారంలో స్వామి, అమ్మవార్ల ప్రతిమలను అమర్చారు.
యాదాద్రికి వచ్చే భక్తులకు వేసవిలో ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానాలయంతోపాటు కొండ చుట్టూ గల ప్రధాన కేంద్రాల వద్ద దివీస్ కంపెనీ సహకారంలో స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో 20 దివీస్ ఆర్ఓ ప్లాంట్లు, ఆరు మూవబుల్ ప్లాంట్లు, మరో ఆరు చిల్లర్ల, 20 వాటర్ సింక్లను అందుబాటులో ఉంచారు.
దీంతోపాటు ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రధానాలయం, ముఖ మండపం, క్యూ కాంప్లెక్స్లో ఏసీలు బిగించారు. మొదటి అంతస్తులో 14 టీఆర్, రెండో అంతస్తులో 16 టీఆర్, మూడో అంతస్తులో 131 టీఆర్ సామర్థ్యమున్న ఏసీలను ఏర్పాటు చేశారు. దీంతో చల్లటి వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహుడి హుండీ ఆదాయం రోజురోజుకూ పెరుగుతున్నది. గత నెల 19 నుంచి ఈ నెల 24 వరకు హుండీ ఆదాయం రూ.2,95,69,973 సమకూరింది. ఇందులో 21 రోజుల హుండీని ఈ నెల 10న లెక్కించగా 1,72,15, 312 నగదు, మిశ్రమ బంగారం 184 గ్రాములు, మిశ్రమ వెండి మూడు కిలోల 400 గ్రాములు, 17వ తేదీన రూ.55,09,088, నగదు మిశ్రమ బంగారం 134 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 150 గ్రాములు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
24వ తేదీన 68,45,573 నగదు, మిశ్రమ బంగారం 33 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 970 గ్రాములు సమకూరింది. దీంతోపాటు ఆస్ట్రేలియా కరెన్సీ, అమెరికా, సౌదీ అరేబియా, కెనడా, సింగపూర్ దేశాల కరెన్సీ భారీగా స్వామివారి హుండీలోకి చేరింది. దేవాలయ చరిత్రలో ఎన్నాడూలేని విధంగా విదేశీ కరెన్సీ భారీగా స్వామివారి ఖజానాకు చేరుతున్నదని ఆలయ అధికారులు తెలిపారు. గతంలో 20 రోజులకోసారి హుండీ లెక్కించగా.. ఆదాయం పెరుగడంతో ఇప్పుడు ప్రతి మంగళవారం హుండీ లెక్కింపు చేపడుతున్నారు.
యాదాద్రి పునర్నిర్మాణానంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం 4నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిరంతరంగా స్వామివారి దర్శనాలు కొనసాగిస్తున్నాం.
రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇంకా కొన్ని నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. అవి త్వరలో పూర్తికానున్నాయి. భక్తులకు వసతుల కల్పనలో రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎన్.గీత, యాదాద్రి దేవస్థానం ఆలయ ఈఓ
వేసవిలో ఎండ వేడిని తట్టుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానాలయంతోపాటు, క్యూ కాంప్లెక్స్లో అధునాతన ఏసీలను బిగించగా అందుబాటులోకి వచ్చాయి. క్యూ లైన్లో నిలబడే భక్తులు ఉక్కపోతకు గురికాకుండా ఏర్పాటు చేశాం.
– ఊడేపు రామారావు, ఆలయ విద్యుత్ విభాగం ఈఈ