యాదాద్రి, మే 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో మంగళవారం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు, ఆరగింపు చేపట్టారు. ఉదయం 5.15 నుంచి 6.15 గంటల వరకు స్వామివారికి నిజాభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు.
అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయ ప్రాకారంలో లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. తొలుత సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. సాయంత్రం ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా చేపట్టారు.
అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాలల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింది పాత గోశాల వద్ద సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని, వ్రతం ఆచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు వైభవంగా సాగాయి.
స్వామి సన్నిధిలో ఉన్న క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. స్వామికి వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
స్వామి వారి 7 రోజుల హుండీల ఆదాయం రూ. రూ.68,45,573 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరితహోటల్లో హుండీలను లెక్కించారు. మిశ్రమ బంగారం 33 గ్రాములు, మిశ్రమ వెండి 970 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. 137 అమెరికా డాలర్లు, 175 సౌదీ అరేబియా రియాల్స్, 10 కెనడా డాలర్లు, ఒకటి ఖతర్ రియాల్ వచ్చినట్లు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ఎంపీ కవిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఉదయం యాదాద్రికి చేరుకున్న వారు, ఆలయంలో స్వయంభువును దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ప్రాకారంలోని అద్దాల మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,64,248
వీఐపీ దర్శనాలు 60,000
వేద ఆశీర్వచనం 12,600
సుప్రభాతం 2,600
క్యారీబ్యాగుల విక్రయం 11,000
వ్రత పూజలు 75,200
కల్యాణకట్ట టిక్కెట్లు 19,400
ప్రసాద విక్రయం 7,83,150
వాహనపూజలు 6,000
అన్నదాన విరాళం 30,406
శాశ్వత పూజలు 20,000
సువర్ణ పుష్పార్చన 1,20,800
యాదరుషి నిలయం 65,800
లక్ష్మీపుష్కరిణి 800
పాతగుట్ట నుంచి 27,530
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
గోపూజ 800