యాదాద్రి భువనగిరి, జూలై 8 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా దూసుకుపోతున్నది. రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచి జోరు కొనసాగిస్తున్నది. ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్తో జిల్లా రికార్డుల్లోకి ఎక్కుతున్నది. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోనే నల్లగొండ సైతం మూడో స్థానంలో నిలిచింది.
చకచకా ఎస్ఐఆర్..
ఓటర్ల జాబితాలో తప్పులు సరిదిద్దేందుకు, చనిపోయిన లేదా ఇండ్లు మారిన వారి ఓట్లను తొలగించేందుకు, డూప్లికేట్, డబుల్ ఓట్లను తొలగించేందుకు, కొత్త ఓటర్ల నమోదుకు దేశ వ్యాప్తంగా సర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు సర్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ నెల 31న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. ఆగస్టు 30వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 1నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. యాదాద్రిలో ఇప్పటికే బీఎల్వోలను నియమించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
98.81శాతం ఫారాల పంపిణీ..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 566 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆలేరు, భువనగిరి నియోజకర్గాల్లో మొత్తం 4,59,943 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఆలేరులో 2,38,040, భువనగిరి నియోజకవర్గంలో 2,21,903 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరందరికీ ఇంటింటికి తిరిగి బీఎల్వోలు ఫారాలు అందించాల్సి ఉంది. మంగళవారం వరకు జిల్లాలో 98.81శాతంతో 4,54,476 మందికి ఫామ్లు పంపిణీ చేశారు. మరో 5467 మందికి పత్రాలు పంపిణీ చేయాలి. గుండాల మండలంలో అత్యధికంగా 99.99 శాతం ఫారాలు పంచారు. ఆ తర్వాత యాదగిరిగుట్టలో 99.90 శాతం, మోటకొండూరులో 99.81, బొమ్మల రామారంలో 99.65శాతం చొప్పున ఫారాలు అందించారు.
డిజిటలైజేషన్లో అగ్రస్థానం..
ఓటర్లకు అందించిన ఫారాలను నింపిన తర్వాత బీఎల్వోలు స్వీకరిస్తున్నారు. అయితే వాటిని తిరిగి ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే ఫామ్ డిజిటలైజేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నది. అయితే బీఎల్వోలే యాప్లో స్వయంగా ఆన్లైన్ చేయాల్సి ఉండటంతో కొద్ది మేర ఆలస్యం అవుతున్నది. అయినప్పటికీ రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో 41.27 శాతంతో 1,89,804 మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేశారు.
మరో 2.77 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉంది. యాదాద్రికి దరిదాపుల్లో ఏ జిల్లా కూడా కనిపించడంలేదని అధికారులు చెబుతున్నారు. ఇక యాదాద్రి తర్వాత 29.43 శాతంతో నల్లగొండ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ 15,08,148 మంది ఫారాలు పంపిణీ చేయగా, 4,46,163 ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. సూర్యాపేట కేవలం 10.06 శాతంతో వెనుకబడింది. ఇక్కడ 9,95,692 ఫారాలను పంపిణీ చేయగా, కేవలం 1,01,400 పత్రాలను మాత్రమే ఆన్లైన్ చేశారు. 1.29 శాతంతో మేడ్చల్ చివరి స్థానంలో ఉంది. ఇక ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాలో 441 డూప్లికేట్, డబుల్ ఓట్లను గుర్తించారు.
కష్టంగా మారుతున్న ఫారాలు నింపుడు..
సర్లో ప్రధానంగా ఫారాలు నింపడం కష్టంగా మారిం ది. గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులు ఉండటంతో ఫారాలు నింపడంలో ఓటర్లు గందరగోళ పడుతున్నారు. చదువుకున్నోళ్లకు సైతం ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో వీరికి సమాధానం చెప్పడానికే బీఎల్వోలకు సమయం సరిపోతున్నది. ఒక్కో ఇంటి వద్ద గంట సమయం పడుతున్నది. అంతే కాకుండా యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల బీఎల్వోలు ఇంటికి వెళ్లి పంచగా, మరికొన్ని చోట్ల ఓటర్లు వెళ్లి తెచ్చుకుంటున్న పరిస్థితులు కనిపించాయి.
అగ్రస్థానంలో కొనసాగుతాం..
సర్ ప్రక్రియలో భాగంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో బీఎల్వోలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. బూత్ స్థాయి అధికారులకు, ఏజెంట్లకు కార్యచరణ ప్రకారంగా సమావేశాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. మున్ముందు కూడా మొదటి స్థానంలోనే ఉండటంతోపాటు విజయవంతంగా పూర్తి చేసేందుకు మరింత కృషి చేస్తాం.
-వెంకారెడ్డి, యాదాద్రి అడిషనల్ కలెక్టర్