మహిళలు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్నది. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు అవకాశం కల్పించింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 7 డిపోల పరిధిలో పల్లె వెలుగు 377, ఎక్స్ప్రెస్ 144 బస్సులు నడుస్తున్నాయి. రోజూ సుమారు 70 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. దాంతో ప్రభుత్వంపై రోజుకు రూ.50 లక్షల భారం పడనున్నది.
నల్లగొండ సిటీ, డిసెంబర్ 8 : ఆర్టీసీ బస్సులో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇందుకోసం కండక్టర్కు మహిళలు ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు ఉచితంగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాష్ట్రం దాటితే మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పించారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 7 డిపోల పరిధిలో 521 బస్సులు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉండగా వాటిలో అందులో 377 పల్లె వెలుగు, 144 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. ఆయా సర్వీసుల్లో సుమారుగా ప్రతి రోజు 70 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు ఆధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణంతో మరి కొంత మంది పెరగవచ్చని అంచనా. దాంతో రీజియన్ నుంచి సుమారు రోజుకు రూ. 50 లక్షల వరకు ప్రభుత్వంపై భారం పడనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలు టికెట్ లేకుండా ప్రయాణించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్ర సరిహద్దు వరకు ఎలాంటి టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చు. వేరే రాష్ట్రం వెళ్తే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని మహిళ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీదేవి, ఆర్ ఎం