పేరుకు జిల్లా కేంద్రం అయినా ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి తీవ్ర వెనుకబాటుకు గురైన నియోజకవర్గం నల్లగొండ. పట్టించుకునే పాలకుల్లేక, సరిపడా నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. ఇరుకు రోడ్లు, అధ్వానమైన డ్రైనేజీ వ్యవస్థ, పత్తాలేని పట్టణ సుందరీకరణ, కరువైన మౌలిక వసతులు.. ఇలా అనేక సమస్యలు వేధించేవి. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రత్యేక చొరవతో నల్లగొండ రూపురేఖలు మారుతున్నాయి. దశాబ్దాల నాటి దారిద్య్రం వీడి కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. కేవలం నాలుగేండ్లలోనే దాదాపు రూ.1,500 కోట్ల అభివృద్ధి సాధ్యమైంది. నీలగిరిని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ రూ.900 కోట్లు కేటాయిచడంతో శరవేగంగా పట్టణాభివృద్ధి జరుగుతున్నది. ఇప్పటికే మంజూరైన రూ.716.77 కోట్లతో జిల్లాకేంద్రం రహదారులు విశాలంగా రూపుదిద్దుకుంటున్నాయి. జంక్షన్లు జిగేల్ మంటున్నాయి. సమీకృత మార్కెట్, మినీ పార్కులతోపాటు సకల వసతులు సమకూరుతున్నాయి. మెడికల్ కాలేజీ ఏర్పాటు, జిల్లాకేంద్ర దవాఖాన ఆధునీకరణతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు చేరువయ్యాయి. ఐటీ హబ్ నిర్మాణం చకచకా సాగుతుండగా, త్వరలోనే సాఫ్ట్వేర్ కొలువులు రానున్నాయి. మరోవైపు నియోజకవర్గంలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లోనూ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. ఎందరో మేధావులు, ప్రముఖులను సమాజానికి అందించిన ఎన్జీ కాలేజీ ఆధునీకరణకు నోచుకున్నది. మరోవైపు రైతు బంధు, దళిత బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, చేనేత కార్మికులు, మత్స్యకారులు, గీత కార్మికుల భరోసాతోపాటు ప్రతిగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద నాలుగేండ్లలోనే రూ.107 కోట్ల లబ్ధి చేకూరడం విశేషం.
– నల్లగొండ, మార్చి 20
నల్లగొండ, మార్చి 20 : రెండు దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉన్న నల్లగొండ నియోజకవర్గం వెనుకబాటుకు గురికాగా.. నాలుగేండ్లుగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడం, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా కేంద్రం అభివృద్ధి బాట పట్టింది. బీఆర్ఎస్ గెలుపొందిన తర్వాత సుమారు రూ.15 వందల కోట్లతో నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ప్రధానంగా నీలగిరి పట్టణం రూ.900 కోట్లతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. రూ.50 కోట్లతో ఐటీ హబ్ నిర్మాణం జరుగుతుండగా.. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రూ.36 కోట్లతో ఎన్జీ కళాశాల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. నియోజకవర్గంలోని 73 గ్రామ పంచాయతీల్లో దాదాపు వంద కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రికి మరిన్ని నిధులు..
పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు నల్లగొండ జనరల్ ఆస్పత్రిని 250 పడకల నుంచి 550 పడకలకు విస్తరించింది. దీంతోపాటు దవాఖానలో అధునాతన పరికరాలు సమకూర్చడం, వైద్యుల కేటాయింపుతో పేదలకు వైద్యం చేరువైంది. డయాలసిస్ కేంద్రం, పది పడకలతో పాలీ కేర్ క్యాన్సర్ యూనిట్, పిల్లల కోసం 12 పడకలతో ఐసీయూ, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 550 పడకలకు ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేశారు. రక్త పరీక్ష నుంచి సిటి స్కాన్ వరకు ఇక్కడే ఉచితంగా చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు చేయగా.. ప్రస్తుతం బ్యాచ్కు 150 మంది చొప్పున నాలుగు బ్యాచ్ల్లో 600 మంది విద్యార్థులు పలు కోర్సుల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మెడికల్ కళాశాల భవనం కోసం ప్రభుత్వం రూ.251 కోట్లు కేటాయించగా.. ఎస్ఎల్బీసీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
గ్రామాల అభివృద్ధి
నియోజకవర్గంలో మొత్తం 73 గ్రామ పంచాయతీలు ఉండగా.. పల్లె ప్రగతి, ఎస్డీఎఫ్, ఇతర ప్రత్యేక నిధులతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. మౌలిక వసతులు సమకూరాయి. రూ.7.3 కోట్లు వెచ్చించి అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేయడంతో రెగ్యులర్గా చెత్త సేకరణ జరుగుతుంది. ఆ చెత్తను ఎరువుగా మార్చడానికి రూ.2.80 కోట్లతో గ్రామాల్లో డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. రూ.7 కోట్లతో వైకుంఠధామాలు, రూ.2 కోట్లతో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. రైతులు ఒకే దగ్గరికి చేరి చర్చించుకునేందుకు, అధికారుల సలహాలు తీసుకోవడానికి రూ.3.52కోట్లతో నియోజకవర్గంలో 16 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారు. హరితహారం కింద ప్రతి గ్రామంలో వన నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.33కోట్లతో రెండేండ్ల కింద సీసీ రోడ్లు వేయగా.. మలి దశలో ప్రస్తుతం రూ.19.8 కోట్లతో పాటు ఉపాధిహామీ కింద మరో రూ.30 కోట్లతో సీసీ రోడ్లు వేశారు. మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలో 79,309 ఇండ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చి మంచి నీటిని అందిస్తున్నారు. తిప్పర్తి మండలం మామిడాలలో రూ.4 కోట్లతో వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా 7,335 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం జరిగింది. సాగు మిషన్ కాకతీయ కింద 380 చెరువులను పునరుద్ధరించడంతో వాటి పరిధిలో ఉన్న 22,450 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఎస్ఎల్బీసీ ఎడమ కాల్వకు వరుసగా సాగు నీరు అందించడంతో నియోజకవర్గంలో 1.62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది.
మన ఊరు – మన బడితో ప్రభుత్వ బడుల ఆధునీకరణ
అభివృద్ధి, సంక్షేమంతో పాటు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విద్యాలయాల ఆధునీకరణకు, వసతుల కల్పనకు మన ఊరు – మన బడి కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీని ద్వారా నియోజకవర్గంలో తొలి దశలో 67 పాఠశాలలను ఎంపిక చేసి రూ.11.92 కోట్లతో 13 రకాల పనులు చేపట్టారు. శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. కొన్నింటికి మరమ్మతులు, మౌలిక వసతులు కల్పించి సర్కారు బడులను సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యకు నాంది అయిన ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలను రూ.36 కోట్లతో ఆధునీకరించాలనుకున్న ప్రభుత్వం.. తొలి దశలో రూ.12 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
సుందరంగా ముస్తాబవుతున్న నీలగిరి
ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల పట్టింపు లేమి కారణంగా వెనుకబాటుకు గురైన నల్లగొండ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా పట్టణ అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఆ వెంటనే రూ.716.77 కోట్లు విడుదల చేసింది. దాంతో పట్టణం అందంగా రూపుదిద్దుకుంటున్నది. పట్టణంలోని అన్ని రోడ్ల ఆధునీకరణతో పాటు మర్రిగూడ బైపాస్, కళాభారతి, ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మాణం, ప్రధాన కూడళ్లలో జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్, స్వాగత తోరణాల ఏర్పాటు, వల్లభరావు, ఉదయ సముద్రం చెరువుల ఆధునీకరణ, సమీకృత మార్కెట్లు, రైతు బజార్ల ఏర్పాటు, పార్కులు, స్టేడియం అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. వీటిల్లో ఇప్పటికే చాలా వరకు పూర్తికాగా.. మరికొన్నింటి పనులు జరుగుతున్నాయి. కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. రూ.50 కోట్లతో ఐటీ హబ్ నిర్మాణం చేపట్టగా.. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇది మరో ఏడాదిలో పూర్తి కానుండగా.. 15వందల మంది సాఫ్ట్వేర్ నిపుణులకు ఉద్యోగ అవకాశం లభించనుంది.
ఇండోర్ స్టేడియం
నియోజకవర్గ అభివృద్ధ్దితోపాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 34,258 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు ప్రతి నెలా రూ.7.41 కోట్లు అందజేస్తున్నది. దళిత బంధు పథకం కింద తొలి దశలో వంద మందికి రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేసుకున్న 5,899 మందికి ఈ నాలుగేండ్లలో రూ.27.61 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా నియోజకవర్గంలో 7,781 మంది లబ్ధిదారులకు రూ.1,00,116 చొప్పున మొత్తం 77,90,02,596 రూపాయలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోళ్లకు అండగా నిలిచారు. రైతు బంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో 2018 వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు సగటున 60వేల మంది రైతులకు తొమ్మిది విడుతల్లో 772,65,35,250 రూపాయల పెట్టుబడి సాయం అందించింది. వివిధ కారణాలతో 544 మంది రైతులు మృతిచెందగా.. వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.27.20 కోట్ల బీమా అందజేసింది.
నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు..
నల్లగొండను రోల్మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యం
నియోజకవర్గ ప్రజలు గతంలో ఒకే వ్యక్తికి రెండు దశాబ్దాల పాటు అవకాశం ఇచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడింది. నేను ఎమ్మెల్యే అయ్యాక ఇప్పటి వరకు నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.15 వందల కోట్లు తీసుకొచ్చాను. నల్లగొండ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.900 కోట్లు మంజూరు చేయించా. ఇందులో ఇప్పటికే రూ.716 కోట్లు విడుదల కాగా.. పలు అభివృద్ధి పనులు చేపట్టాం. మరికొన్ని జరుగుతున్నాయి. త్వరలోనే పట్టణం పూర్తి స్థాయిలో అందంగా ముస్తాబవుతుంది. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తో పట్టణమంతా రాత్రి పూట జిగేల్మనేలా ప్లాన్ చేశాం. అదేవిధంగా నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని ఆవాసాల అభివృద్ధికి పల్లె ప్రగతి, ఎస్డీఎఫ్, ఉపాధి హామీ నుంచి రూ.100కోట్లకు పైగా వెచ్చించి సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేశాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నల్లగొండకు ఐటీ హబ్, మెడికల్ కళాశాల తీసుకొచ్చాను. 20 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఈ నాలుగేండ్లలోనే చేసి చూపించాం. నల్లగొండను మరో సిరిసిల్ల, సిద్దిపేటలా అభివృద్ధి చేసి రాష్ర్టానికి రోల్మోడల్గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.
– కంచర్ల భూపాల్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రం
నాకు ఊహ తెలిసిన కాన్నుంచి ఎప్పుడూ గ్రామంలో చెత్త సేకరణ ఉండేది కాదు. డ్రైనేజీలు క్లీన్ చేయకపోయేది. వీధి లైట్లు పోయినా పట్టించుకోకపోయేది. ఎవరైనా చనిపోతే కర్మకాండలు చేసే స్థలం లేక ఇబ్బందులు పడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు రోజు తప్పి రోజు వీధులను ఊడ్చడంతో పాటు మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు పార్కులను తలపిస్తున్నాయి. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పెద్దవి కావడంతో పచ్చని వాతావరణం నెలకొంది. పల్లె ప్రగతితో ఎక్కడ చూసినా పరిశుభ్రత, ఆహ్లాద వాతావరణం కనిపిస్తున్నది. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు నేడు గ్రామ స్వరాజ్యానికి పునాదులుగా ఉన్నాయి.
– కానువ భూపతి, జి.ఎడవెల్లి, కనగల్ మండలం
అంతర్గత రోడ్ల నిర్మాణంతో బాధలు తప్పినయి..
మా గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే అంతర్గత రోడ్లకు మహర్దశ వచ్చింది. గతంలో కొద్దిపాటి చినుకులు పడినా వీధులన్నీ జలమయమయ్యేవి. రాత్రి సమయంలో ఎక్కడ గుంతలు ఉండేవో.. ఎక్కడ బురద ఉండేదో తెల్వక జారిపడేది. ఒకప్పుడు మండలానికి సీసీ రోడ్లకు లక్షల్లో నిధులు కేటాయిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి ఒక్కో మండలానికి రూ.5 కోట్ల వరకు నిధులు ఇస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గ్రామానికి రూ.20 లక్షలు కేటాయించడం హర్షణీయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మా గ్రామానికి ఇప్పటి వరకు కోటికి పైగా నిధులు వెచ్చించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. గ్రామ సమస్యలు తీర్చిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి రుణపడి ఉంటాం.
– కొండ సంతోష, కంచనపల్లి, నల్లగొండ మండలం
ఊహించనంత
సంవత్సర కాలంగా అనేక రకాల అభివృద్ధి పనులతో నల్లగొండ పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయి. రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా చేపట్టారు. మర్రిగూడ జంక్షన్ నుంచి క్లాక్టవర్ వరకు రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్, జంక్షన్లు చూడచకగా ఉన్నాయి. రాత్రిపూట లైటింగ్ ఆహ్లాదంగా ఉన్నది. సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.పట్టణ శివారులోని అర్బన్ పార్కు, రాంనగర్ పారులకు ఈ మధ్య వెళ్లాం. గతానికి, ఇప్పటికి చాలా తేడా వచ్చింది. రకరకాల బొమ్మలు, బోటింగ్, జంతువులతో కూడిన బొమ్మలు ఏర్పాటు చేశారు. వాటితో పిల్లలు చాలా సంతోషంగా ఆడుకున్నారు. వారిని చూస్తే మా చిన్నతనం గుర్తుకొచ్చి ఆడుకోవాలనేంత ఆనందం అనిపించింది. ఎంతసేపైనా పార్కు నుంచి బయటకు పోవాలనిపించ లేదు. నల్లగొండ పట్టణాన్ని సుందరంగా మార్చిన సీఎం కేసీఆర్కు పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– పాదూరి ఇంద్రసేనారెడ్డి, విశ్రాంత ఉద్యోగి, నల్లగొండ పట్టణం
ఆధునిక విద్యా నిలయంగా ఎన్జీ కళాశాల
ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుగాంచిన నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల సీఎం కేసీఆర్ నిర్ణయంతో భవిష్యత్తులో ఆధునిక విద్యా నిలయంగా మారనుంది. ఇప్పటికే రూ.6.5కోట్లతో కళాశాలలో నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవనం అవసరమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి రూ.30కోట్లు మంజూరు చేశారు. ఆ వెంటనే ప్రణాళికాయుతంగా పనులను ప్రారంభించడం చాలా సంతోషకరం. సంవత్సర కాలంలో అందుబాటులోకి రానున్న నూతన భవనంతో ఎన్జీ కళాశాల భవిష్యత్తులో ఎడ్యుకేషన్ హబ్గా నిలుస్తుంది.
– డాక్టర్ ఘన్శ్యాం, ఎన్జీ కాలేజీ ప్రిన్సిపాల్, నల్లగొండ