ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 11 చోట్ల గెలుపు సాధించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి
గుంటకండ్ల జగదీశ్రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. నల్లగొండ, మునుగోడులో పోటీ చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్, హుజూర్నగర్, కోదాడలో బరిలో నిలిచిన ఉత్తమ్కుమార్రెడ్డి, పద్మావతి దంపతులు గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఐదుగురు గెలుపొందారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో జిల్లా అంతటా కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం మూడు చోట్ల కౌంటింగ్ జరుగగా అన్ని చోట్లా లెక్కింపు సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి
పీల్చుకుంది.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గత నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగగా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. నల్లగొండలో ఆరు నియోజకవర్గాలు, సూర్యాపేటలో నాలుగు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరిగింది. అన్నిచోట్లా కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ఉదయం 8గంటలకే ఓట్ల లెక్కింపు మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థులంతా ఉదయాన్నే చాలా వరకు కౌటింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
ఫలితాల సరళిని బట్టి కాంగ్రెస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు మధ్యాహ్నం తర్వాత చేరుకున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును షురూ చేసి.. ఆ వెంటనే ఈవీఎంలను ఓపెన్ చేశారు. ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఒక రౌండ్ చొప్పున 14 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగింది. దీంతో ఉదయం 11 గంటల్లోపే ఫలితాల సరళి స్పష్టమైంది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు గానూ ఆది నుంచీ 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్రెడ్డి తొలి రౌండ్ నుంచి చివరి వరకు ఆధిక్యతను చూపుతూ విజయం సాధించారు.
సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థ్ధి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. జగదీశ్రెడ్డికి 75,143 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్రెడ్డికి 70,537, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావుకు 40,407 ఓట్లు పోలయ్యాయి. దీంతో జగదీశ్రెడ్డి 4,606 ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి విజయకేతనం ఎగురవేశారు. 2009లో హుజూర్నగర్ నుంచి తొలిసారి బరిలోకి దిగి ఓటమి చెందిన జగదీశ్రెడ్డి 2014, 2018, 2023 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. మంత్రి గెలుపుతో సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవం జరుపుకొన్నారు.
సూర్యాపేట మినహా మిగతా 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. నల్లగొండ జిల్లాలో ఆరు, సూర్యాపేటలో మూడు, యాదాద్రి జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి 1,07,405 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డికి 53,073 ఓట్లు వచ్చాయి. 54,332 ఓట్ల మెజార్టీతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజయం సాధించారు. నకిరేకల్లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశానికి 1,33,540 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు 64,701 ఓట్లు వచ్చాయి. వీరేశం 68,839 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి 1,19,624 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి 79,034 ఓట్లు పోలయ్యాయి. రాజగోపాల్రెడ్డి 40,590 ఓట్ల మెజార్టీతో విన్ అయ్యారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలూనాయక్ 1,11,344 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్కు 81,323 ఓట్లు వచ్చాయి.
బాలూనాయక్ 30,021 ఓట్లతో గెలుపొందారు. నాగార్జునసాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్రెడ్డికి 1,19,831 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థ్ధి నోముల భగత్కు 63,982 ఓట్లు పోలయ్యాయి. దీంతో జైవీర్రెడ్డి 55,849 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి 1,14,462 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థ్ధి 65,680 ఓట్లు పోలయ్యాయి. దీంతో లక్ష్మారెడ్ది 48,782 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఉమ్మడి జిల్లాలో విజయం సాధించిన వారిలో ఐదుగురు తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సారి గెలుపొందిన వారిలో కుందూరు జైవీర్రెడ్డి చిన్న వయస్సు కలిగిన అభ్యర్థి, ఆయన తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నారు. మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల సామ్యేల్, ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య, భువనగిరి నుంచి కుంభం అనిల్కుమార్రెడ్డి తొలిసారిగా గెలుపొందిన వారిలో ఉన్నారు. కాగా సూర్యాపేటలో చివరిసారి అంటూ బరిలోకి దిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి మరోసారి జగదీశ్రెడ్డి చేతిలో పరాభవం తప్పలేదు. సూర్యాపేట నుంచి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావు మూడోసారి కూడా మూడో స్థానంతోనే సరిపెట్టుకోక తప్పలేదు.
హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డికి 1,16,707 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 71,819 ఓట్లు వచ్చాయి. ఉత్తమ్కుమార్రెడ్డి 44,888 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 1,25,783 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ అభ్యర్థ్ధి బొల్లం మల్లయ్యయాదవ్కు 67,611 ఓట్లు వచ్చాయి. దీంతో పద్మావతి 58,172 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థ్ధి మందుల సామ్యేల్కు 1,29,535 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్కుమార్కు 78,441 ఓట్లు వచ్చాయి. దీంతో సామ్యేల్ 51,094 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డికి 1,02,742 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డికి 76,541 ఓట్లు రాగా.. 26,201 ఓట్ల ఆధిక్యతతో అనిల్కుమార్రెడ్డి గెలుపొందారు. ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్యకు 1,22,140 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థ్ధి గొంగిడి సునీతామహేందర్రెడ్డికి 72,504 ఓట్లు పోలయ్యాయి. అయిలయ్య 49,636 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.