స్వామివారి ఖజానాకు రూ. 14,32,070 ఆదాయం
యాదాద్రి, జూలై 1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ కోలహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. అద్దాల మండపం ఊయలలో శయనింపు గావించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ అర్చక బృందం లాలిపాటలు పాడారు. నారసింహుడికి నిత్యారాధనలు వైభవంగా చేపట్టారు. తెల్లవారుజాము మూడు గంటలకు నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపించారు. నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. స్వామివారి తిరువారాధన అనంతరం ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన నిర్వంహించారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ. 600 టికెట్ తీసుకున్న భక్తులచే సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన గావించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. స్వామి, అమ్మవార్లకు ఆర్జితపూజలు కోలాహలంగా జరిగాయి. ఉదయం సుదర్శన నారసింహహోమం జరిపి లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వ హించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవ కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. సత్యనారాయణ వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుమారు 13 వేల మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 14,32,070 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.
12 వీల్చైర్ల బహూకరణ..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శనానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్లను పలువురు దాతలు అందజేశారు. యాదగిరిగుట్టకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రచ్చ యాదగిరి శుక్రవారం 12 వీల్ చైర్లను ఆలయ ఈఓ గీతకు అందజేశారు.
అన్నదానానికి రూ. 15 వేల విరాళం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అన్నదానానికి పలువురు దాతలు విరాళాలు సమర్పించారు. హన్మకొండకు చెందిన కృష్ణారెడ్డి శాశ్వత అన్నదానం కోసం రూ. 15 వేల విరాళాన్ని ఆలయంలో ఈఓ ఎన్. గీతకు అందజేశారు.