నీలగిరి, జనవరి 14 : ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో సుమారు 30లక్షల మంది ఆడబిడ్డలు ఉచితంగా సొంత గ్రామాలకు వెళ్లారన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతులు పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థ్ధిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిరులను గ్రామ సభల్లోనే ఎంపిక చేస్తామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటనీ పూర్తి చేసి 12 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో రూ.10 కోట్లతో హాస్టల్ నిర్మాణం, నల్లగొండ నుంచి ముషంపల్లి, కన్నెకల్ మీదుగా తిప్పర్తి వెళ్లేలా రూ.100 కోట్లతో, గుండ్లపల్లి నుంచి రేగట్టె వరకు రూ.30 కోట్లతో డబుల్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. దర్వేశిపురం వయా దోరెపల్లి, పగిడిమర్రి వరకు రూ.34 కోట్లతో రోడ్డు పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఎంక్వయిరీ వేశామని, సమగ్ర నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా కేంద్రంలో మిగిలిపోయిన డ్రైనేజీ, రోడ్లతోపాటు మున్సిపాలిటీలో విలీనం చేసిన చర్లపల్లి, మర్రిగూడెం, ఆర్జాలబావిలో మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో నల్లగొండ మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ అబ్బగోని రమేశ్, నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్ కేసారి వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.