నల్లగొండ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల ననుసరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కలెక్టరేట్ లో నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ముందుగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎస్.పి రెమారాజేశ్వరి, జడ్.పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎం.ఎల్.సి. కోటి రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, నోముల భగత్, మున్సిపల్ చైర్మన్ యం.సైదిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, వి.చంద్రశేఖర్ లు, ఆసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహాన్ లు, జిల్లా అధికారులు జాతిపిత మహాత్మాగాంధీ, డా.అంబెడ్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ రోజు మనందరికి పండుగ రోజు. ప్రపంచంలో నే గొప్ప సర్వ సత్తాక ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం ను నిలుపు కునేందుకు భారత రత్న డా.బి.ఆర్.అంబెడ్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలులోకి వచ్చిందన్నారు. భారత స్వాతంత్ర్యo కోసం పోరాటం సాగించిన అమర వీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు.