అర్వపల్లి, జూన్ 11 : క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి, 2025 చివరి నాటికి వరకు భారతదేశం నుండి క్షయను పూర్తిగా నిర్మూలించాలని అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భూక్యా నగేశ్ కోరారు. బుధవారం మండలంలోని కుంచమర్తిలో టీబీ యాక్టివ్ కేసు నిర్దారణ శిబిరాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎవరికైనా టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నయం అవుతుందన్నారు.
ఏవరికైనా క్షయ లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఆశ కార్యకర్తలను, అరోగ్య సిబ్బందిని సంప్రదించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్థానిక సిబ్బంది వద్ద పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో అందించే మందులను వాడి వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ పర్సన్ వీరయ్య , ల్యాబ్ టెక్నీషియన్ చొక్కయ్య, హెల్త్ అసిస్టెంట్ నాగరాణి, ఆశ కార్యకర్త విజయ పాల్గొన్నారు.