నల్లగొండ, నవంబర్ 23 : ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారు చట్టం తీసుకొస్తాం’ ఇదీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వయంగా చేసిన కామెంట్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఈ చట్టం తీసుకొస్తే రైతులకు ఉరే గతి అని ఆందోళన చెందుతున్నారు. దాని ప్రకారం రైతులు తమ భూమిని కౌలుకు ఇస్తే కచ్చితంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుందని, దీంతో భూయజమాన్య హక్కులకే ఎసరు వచ్చే ప్రమాదం వస్తుందని గుబులు పడుతున్నారు. అంతేకాకుండా న్యాయంస్థానంలో నిలబెట్టే పరిస్థితి ప్రమాదం ఉంది. దీంతో పల్లెల్లో కౌలు చిచ్చు రాజుకోవడంతోపాటు ఊర్లలో ప్రశాంతత దెబ్బతింటుంది. రైతులు తమ భూములను కౌలుకు ఇవ్వడానికి వెనకాడుతారు.
ఫలితంగా రైతులకు ఉపాధి మార్గాలు తగ్గడంతోపాటు ఉత్పత్తి, దిగుబడి తగ్గుతుంది. కౌలుచట్టం దళారీ రాజ్యానికి బార్లా తలుపులు తెరుస్తుంది. ఇలాంటి ప్రమాదకరైమన చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొస్తామనడంతో రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రైతుల జీవితాల్లో కుంపట్లు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ను గెలవనీయబోమని, కౌలుదారు చట్టం ఆలోచన ఆదిలో తుంచేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడతామని, కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తామని శపథం చేస్తున్నారు.
కాంగ్రెస్ వాళ్లు ధరణి రద్దు చేసి పాత పటేల్, పట్వారీ వ్యవస్థ తెస్తానంటున్నారు. గతంలో పట్వారీ వ్యవస్థలో భూముల సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడ్డం. వీఆర్వోల వెంట కాళ్లరిగేలా తిరిగినం. ఏండ్ల తరబడి వీఆర్వోలు, దళారుల వెంట తిరగడానికే సరిపోయేది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ధరణి తీసుకు రావడంతో రైతుల బాధలు తీరినై. భూముల రికార్డులన్నీ ఆన్లైన్లోనే కనిపిస్తున్నయ్. భూములు అమ్మినా, కొన్నా గంటల టైమ్లోనే పని పూర్తి చేస్తున్నరు. వెంటనే మ్యూటేషన్ కూడా చేస్తున్నరు. పట్టాదారు పాస్బుక్ కూడా వెంటనే ఇస్తున్నరు. దాంతో రైతులు ప్రశాంతంగా ఉంటున్నరు. గప్పటి పరిస్థితి మళ్లీ వస్తే భూముల పట్టాలు ఆగమవుతై.
మళ్లీ పట్వారీలకు పెత్తనమిస్తే మా బతుకులు ఆగమే. లేని పంచాయితీ పెంచుకోవడమే అవుతుంది. గతంల రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, మ్యూటేషన్ వరకు ప్రతి పనికి లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఇక పట్టా పాస్బుక్ రావాలంటే వీఆర్వోలు, తాసీల్దార్ల దయమీద ఆధార పడాల్సి వచ్చేది. మా ఊర్లో అప్పట్లో భూములు కొన్నోళ్లకు మ్యూటేషన్ చేస్తానని లంచం తీసుకొన్న వీఆర్వోలు 7 నంబర్ ఫారం రాయకుండానే పట్టాపాస్బుక్లు ఇచ్చినరు. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే అమ్మినవారి పేరే ఉంది. ధరణి వచ్చినంక ఇలాంటి సమస్యలు తీరినై. కాంగ్రెస్ పార్టీ వాళ్లు మళ్లీ పాత పద్ధతే తెస్తానంటున్నరు. పట్టా పుస్తకంలో కౌలు రైతుల పేర్లు ఇస్తే వారితో పట్టా రైతుల పంచాయితీ మొదలవుద్ది. రైతులు ప్రశాంతంగా ఉండడం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేనట్లుంది. వారి మాటలు నమ్మి గెలిపిస్తే మళ్లీ మా బతుకులు ఆగమైతయ్. ధరణి తెచ్చిన సీఎం కేసీఆర్కే మేమంతా మద్దతిస్తాం.
-కందుల నాగిరెడ్డి, రైతు, దామరచర్ల, (మిర్యాలగూడ రూరల్)
ధరణి తీసేసి కౌలుదారు విధానం తీసుకొస్తామని, రికార్డుల్లో అనుభవదారు కాలం పెడతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొనడం రైతులను నిలువునా ముంచే కుట్రే. కౌలు రైతు పేరును అనుభవదారుడి చేరిస్తే పట్టాదారుడి భూమిపై హక్కు ఇచ్చినట్లే అవుతుంది. తెలంగాణ వచ్చినంక రైతులు మంచిగ బతుకుతున్నరు. ధరణి రావడంతో రైతులకు తిప్పలు తప్పినై. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో వ్యవసాయ భూములు భద్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్లు రైతులను నిలువునా ముంచడం కోసమే ధరణి రద్దు చేస్తామంటున్నరు. మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తే దళారుల ప్రమేయం పెరిగి రైతుల భూములు మాయమయ్యే ప్రమాదం ఉంటుంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణే బాగుంది. మేమందరం దానికే మద్దతు తెలుపుతాం.
– రేకల భిక్షం, రైతు, ఇస్మాయిల్పల్లి, కట్టంగూర్
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన కౌలు చట్టంతో పట్టాదారులకు నిత్యం తిప్పలే ఎదురవుతై. భూమి యజమానితో పాటు కౌలు రైతులకు కూడా హక్కులు కల్పిస్తే ఇద్దరికీ నిత్యం గొడవలే. భూములు ఉన్న వాళ్లు వేరే ఊర్లో ఉంటే తమ భూమి కౌలుకిస్తరు. దానిని సాగు చేసుకోవడం ద్వారా చిన్న, సన్నకారు రైతులు బాగుపడుతున్నరు. కాంగ్రెస్ వాళ్లు చెప్పే కౌలు చట్టంతో అసలు భూములు కౌలికిచ్చేందుకు రైతులే ముందుకు రారు.
దాంతో చిన్న రైతులు భూములు లేక సాగుకు దూరమవుతరు. కౌలు చట్టాన్ని పట్టాదారు లెవరూ అంగీకరించరు సరికదా ఆ చట్టం తెస్తామన్న కాంగెస్ను పాతరెస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ చాలా బాగుంది. ఎవరి భూమి వారి పేరుమీద భద్రంగా ఉంది. వివరాలన్నీ ఆన్లైన్లో ఉంచుతున్నరు. ఎక్కడి నుంచైనా మా భూముల వివరాలు చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ధరణి రద్దుచేస్తే పట్టాదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే రైతులందరూ ధరణి తెచ్చిన బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నరు.
– గంగలి పర్వతాలు, గొట్టిముక్కల, దేవరకొండ రూరల్
ధరణి తీసేసి పాత చట్టాలను మళ్లీ తీసుకొస్తే గతంల రైతులు పడ్డ బాధలు మళ్లీ పడాల్సి వస్తది. తరాల నుంచి రైతులు భూములను కౌలుకు ఇస్తున్నరు. పట్టాదారు కౌలు రైతుకు అగ్రిమెంట్ రాసివ్వడమనేది ఎప్పుడూ లేదు. ఈ చట్టాన్ని తెస్తానని కాంగ్రెస్ వాళ్లు చెప్పడం కబ్జా దారులను ప్రోత్సహించడమే అవుతుంది. రైతులు, కౌలు దారులు నిత్యం గొడవలు పడాలనే ఆ పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నరు. ఇన్ని సంవత్సరాల నుంచి కౌలు రైతులు అగ్రిమెంట్ లేకుండా భూములు తీసుకొని వ్యవసాయ చేయట్లేదా.. మళ్లీ ఇప్పుడెందుకు కొత్త మాటలు.
ఇప్పటి వరకు కౌలుదారుకు, పట్టాదారుకి మధ్య స్నేహ సంబంధాలున్నయ్. కౌలు చట్టంతో ఇద్దరి మధ్య మధ్య చిచ్చుపెట్టి వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ బాగుంది. దీంతో ఎలాంటి గొడవలూ లేవు. ధరణి పోర్టల్తో నిజమైన పట్టాదారులకే హక్కు ఉండేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. రైతుల సంక్షేమం కోసం పాటు పడే బీఆర్ఎస్ వైపే రైతులు ఉంటరు తప్ప రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ లాంటి పార్టీల వైపు ఎవరూ ఉండరు.