సూర్యాపేట, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : నదీజలాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవడం రైతులకు శాపంగా మారుతున్నది. గతేడాది వరకు కాల్వల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇప్పుడు 1800 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు. దాంతో చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు. అలాగే చెరువులను కూడా నింపకపోవడంతో భూగర్భ జలాలు అండుగంటి పోతూ వేసిన పంటలు ఎండిపోతున్నాయి.
ఈ దుస్థితిలో ఎండిన పంటలను రైతులు పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న ఎస్సారెస్పీ ఆయకట్టుకు స్వరాష్ట్రంలో అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీటిని అందించారు. దాంతో 2017కు ముందు 55వేల ఎకరాలకు మించి వరి సాగు కాకపోగా తదనంతరం కాళేశ్వరం జలాల రాకతో 2.58 లక్షల ఎకరాలకు సాగు పెరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో పంట విస్తీర్ణం తగ్గి ఈ యాసంగిలో 2.10 లక్షల ఎకరాల్లో సాగు కాగా అందులో కూడా చాలా ప్రాంతాల్లో పంట ఎండిపోతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని మెజారిటీ మండలాలు పచ్చని మాగాణిగా ఉండేవి. కానీ ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని తుంగతుర్తి నియోజకర్గంతోపాటు సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు రెండున్నర లక్షల ఎకరాలు బీడుగా కనిపించేవి. ఇక్కడ వట్టిపోయిన చెరువులు, చుక్కనీరు అందించని బోర్లు, బావులతో రైతులు అరిగోస పడ్డారు.
దాదాపు 25 ఏండ్ల క్రితం గోదావరి జలాలు తీసుకు వస్తామంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా పరిధిలో ఎస్సారెస్పీ కాల్వలు తవ్వారు తప్ప నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీ ఆయకట్టుకు జీవం వచ్చింది. అంతకుముందు బావులు, బోర్ల కింద 55వేల ఎకరాలకు మించి వరి సాగు కాకపోగా.. 2017 నుంచి కాళేశ్వరం జలాలు రావడంతో ఏటేటా సాగు పెరుగుతూ 2.58లక్షల ఎకరాలకు చేరుకున్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రాజెక్టుల నిర్వహణ లోపంతో ఆయకట్టు తిరోగమనంలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గత ఐదేండ్లుగా కాళేశ్వరం జలాలు జిల్లాలో పరుగులు తీయగా ప్రస్తుతం నత్తనడకన పారుతున్నాయి. గత సీజన్ వరకు కాల్వల ద్వారా 2.13లక్షల ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన పంట పొలాలకు 10 నుంచి 12 టీఎంసీల నీరు చేరింది. ఆయకట్టు పరిధిలోని సుమారు 450 చెరువులు, కుంటలను 1.5టీఎంసీలతో నింపడం ద్వారా మరో 45వేల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కాల్వల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇప్పుడు 1,800 క్యూసెక్కులకు మించి రావడం లేదు. కాలువల ద్వారా కొంతమేర నీళ్లు విడుదల చేస్తూ చెరువులను నింపకుండా వదిలేస్తున్నారు. గతంలో వానకాలం సీజన్ పూర్తయి యాసంగి ప్రారంభమైనా కాళేశ్వరం ఆయకట్టు పరిధిలోని 450 చెరువులు జలకళను సంతరించుకొని ఉన్నాయి. అందులో 75 నుంచి 100 శాతం నీరు ఉన్న చెరువులు 370 ఉన్నాయి. కానీ ప్రస్తుతం 80కి మించి చెరువుల్లో నీరు లేదు.
ఐదేండ్ల కాలంలో ఏనాడూ లేని విధంగా ఈ సారి 25 శాతం జలాలు ఉన్న చెరువులు 50 శాతం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ సారి తుంగతుర్తి నియోజకవర్గంలో సాగు బాగానే ఉన్నప్పటికీ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, పెన్పహాడ్తో పాటు కోదాడ నియోజకవర్గ పరిదిలోని మోతె, నడిగూడెం మండలాల్లో వందలాది ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోతున్నది. ఆయా మండలాల్లో రైతులు తమకు ఉన్న భూమిలో వరి నాటు వేయగా నీరు సరిపడా రాకపోవడంతో కొంతమేర పశువులకు వదిలి, మిగిలిన పంటను కాపాడుకునేందుకు బోర్లు వేస్తూ నానా తంటాలు పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు రావడంతో పంటలు బాగా పండాయి. చెరువులు నీటితో కళకళలాడాయి. రైతులకు ఏ ఇబ్బందీ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు రావడం లేదు. నాట్లు వేసిన పొలాలు వేసినట్లుగానే ఎండిపోతున్నాయి. చెరువుల్లో చుక్క నీరు లేదు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కాళేశ్వరం నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
– మేకల జానయ్య, రైతు, కేశవాపురం, నడిగూడెం
నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. గత సంవత్సరం రెండు కార్లకు కాళేశ్వరం జలాలు రావడంతో ఆరు ఎకరాలు సాగు చేసిన. ఈ సంవత్సరం కూడా కాళేశ్వరం జలాలు వస్తాయని ఆరు ఎకరాల్లో వరి పెట్టిన. కానీ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడం లేదు. చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు తగ్గిపోయాయి. సాగుకు నీరు అందక మూడు ఎకరాల పొలం ఎండిపోయింది. ఎండిపోయిన పొలంలో పశువులను మేపుతున్నాం. ప్రభుత్వం నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
– కేశబోయిన శ్రీశైలం, రైతు, పాతర్లపహాడ్ ఆత్మకూర్.ఎస్ మండలం